రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న మండల వైద్యాధికారిణి నాగరాణి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ ఫిబ్రవరి 26
మంగళవారం యాదగిరిగుట్టలో జరగబోయే ప్రజారోగ్య మరియు వైద్య ఉద్యోగుల 3194 యూనియన్ 55వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని యూనియన్ జిల్లా నాయకులు హర్షం స్వామి పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని మొగుళ్లపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో యూనియన్ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ ను డాక్టర్ నాగరాణి ఆవిష్కరించారు. అనంతరం యూనియన్ జిల్లా నాయకులు హర్షం స్వామి మాట్లాడారు. ఉద్యోగులకు రావాల్సిన 4 డీఏలను, నాణ్యమైన పీఆర్సీని అతి త్వరలో ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని బిల్లులను తక్షణమే విడుదల చేయాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. 317 జీవోలో అన్యాయం జరిగిన ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. వైద్య, ఆరోగ్యశాఖలో ఏర్పాటుచేసిన 142 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగుల పీఆర్సీని కాలయాపన చేసి ఉద్యోగులకు ఎనలేని నష్టం చేసిందన్నారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించి నాణ్యమైన పీఆర్సీని ప్రకటించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు తాళ్లపల్లి రవీందర్, హెల్త్ ఎడ్యుకేటర్ రేష్మ, సూపర్వైజర్ సునీత, ల్యాబ్ టెక్నీషియన్ హర్షం సంపూర్ణ, హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి, ఏఎన్ఎం సునీత, శ్రీను వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.