గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
సకాలంలో రైతులకు రుణాలు అందజేయాలని రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం రోజు కాచనపల్లి ఎస్బిఐ బ్యాంకు ముందు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నా ను ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు నాయని రాజు, గుండాల మండల కార్యదర్శి కొమరం శాంతయ్యలు మాట్లాడుతూ కాచనపల్లి బ్యాంకులో చాలా తక్కువ మంది రైతులకు రుణమాఫీ జరిగిందని ,రుణమాఫీ జరిగిన రైతులకు తిరిగి రుణం చెల్లించడంలో బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, సకాలంలో రైతులకు బ్యాంకు రుణాలు అందజేయాలని వారు డిమాండ్ చేశారు. పాత రుణాలన్నీ మాఫీ చేసి కొత్త రుణాలు వెంటనే ఇవ్వాలని కోరారు. బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీలకు రుణాలు తీసుకొని తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాచనపల్లి బ్యాంకులో సిబ్బంది కొరత కూడా తీవ్రంగా ఉందని ఎక్కువ మంది సిబ్బందిని నియమించి బ్యాంకు సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై లీడ్ బ్యాంకు అధికారులను కూడా కలవనున్నామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల్ డివిజన్ నాయకులు బొర్రా వెంకన్న, గుగ్గిల వెంకటేశ్వర్లు, చంద్రయ్య, గణేష్ ,కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
సకాలంలో రైతులకు రుణాలు అందజేయాలి
