Strengthen Govt Schools Through Enrolment
పిల్లల్ని చేర్పించి ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దాం.
ఎండి సలీం షరీఫ్, మండల విద్యాధికారి కోదాడ
కోదాడ, నేటి ధాత్రి:
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని కోదాడ మండల విద్యాధికారి ఎండి. సలీం షరీఫ్ అన్నారు.గురువారం నాడు కోదాడ పట్టణంలో పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఆజాద్ నగర్ లో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొని మాట్లాడినారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన విద్యార్థులకు రెండు జతల దుస్తులు, పుస్తకాలు, నోట్ బుక్స్, మధ్యాహ్నం పౌష్టికాహారం అందించబడుతున్నట్లు తెలిపారు. పాఠశాలలో కంప్యూటర్ విద్య, వొకేషనల్ విద్య, నిష్ణాతులైన ఉపాధ్యాయుల చేత డిజిటల్ బోధన చేయబడుతుందని తెలియజేసినారు. బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని, ప్రభుత్వ బడుల బలోపేతానికి బడిబాట ప్రచార కార్యక్రమాన్ని ఉదృతం చేయాలని ఉపాధ్యాయులను కోరినారు. పాఠశాల మౌలిక సదుపాయాలు వసతులను తెలియజేస్తూ కరపత్రాలతో పట్టణంలో ఆజాద్ నగర్ పరిసర ప్రాంతాల్లో బడిబాట ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కె.పాండురంగ చారి, రవి, ధర్మ, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చిగురుపాటి శ్రీనివాసరావు, యదా శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
