అసెంబ్లీ టైగర్ ఓంకార్ ఆశయాల బాటలో ముందుకు సాగుదాం

# ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
నర్సంపేట,నేటిధాత్రి :

బూర్జువా భూస్వామ్య పాలక పార్టీల ఎన్నికల హామీలకు మోసపోవద్దని, అసెంబ్లీ టైగర్ అమరజీవి మద్దికాయల ఓంకార్ ఆశయ సాధనలో ముందుకు సాగాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ పిలుపునిచ్చారు. నర్సంపేటలోని జ్యోతిబసు నగర్ లో కాలనీలో పార్టీ జనరల్ బాడీ సమావేశం బండారి మల్లేష్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన పెద్దారపు రమేష్ మాట్లాడుతూ పెరుగుతున్న జనాభా కనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలం చెందారని, స్వాతంత్రం సిద్ధించి 76 సంవత్సరాలు పూర్తయిన నేటికీ మహిళలకు రక్షణ లేని స్థితి నెలకొన్నదని ఆరోపించారు. ప్రజా సంక్షేమం కోసం ఏర్పడిన చట్టసభలను అవకాశవాద అవినీతికర రాజకీయాలుగా మార్చారని పేర్కొంటూ విధానాల ప్రాతిపదికన కాకుండా వివిధ ప్రలోభాలతో ఓటర్లను మభ్యపెడుతూ ఆశాజనక హామీలను ఇచ్చి విస్మరిస్తున్నారని పలు రాజకీయ పార్టీలను ఎద్దేవా చేశారు.హామీల పేరుతో ప్రగల్బాలు పలికిన పలు పార్టీలు అధికారంలోకి వచ్చాక నిత్యవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై భారాలు మోపుతున్నారని అన్నారు. కోట్లాది రూపాయల అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు, పెట్టుబడిదారులకు కట్టబెడుతూ అప్పులు మిగుల్చుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
పీడిత తాడిత ప్రజల కోసం మార్క్సిజాన్ని నమ్ముకుని శ్రమజీవుల కోసం సర్వస్వం అర్పించి నిజాయితీగా ప్రజల కోసం పనిచేసి అసెంబ్లీ టైగర్ గా పేరుగాంచిన అమరజీవి మద్దికాయల ఓంకార్ చూపిన బాటలో ప్రజలు ఆలోచించాలని అప్పుడే ప్రజా సంక్షేమం నీతివంతమైన పాలనకు సాధ్యమవుతుందని అన్నారు. పాలక పార్టీల ప్రలోభాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో బిఎల్ఎఫ్ నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ వంగల రాగసుధ, పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు కుక్కల యాకయ్య, మోటం సురేష్, స్థానిక నాయకులు గడ్డం స్వరూప,ఈర్ల రాజు, సతీష్ బాబు, సుభద్ర, మొగిలి, దేవమ్మ, నిర్మల, ఐలమ్మ, లావణ్య, అచల,యాకయ్య,రావమ్మ, కాజా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!