
Sarathi services
25 నుంచి సారథి సేవలు.. ఖైరతాబాద్ కార్యాలయంలో ప్రారంభం
సారథి సేవలు విస్తరించేందుకు రవాణా శాఖ రంగం సిద్ధం చేస్తోంది. సికింద్రాబాద్ తిరుమలగిరి రవాణా శాఖ కార్యాలయంలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన సేవలు సత్ఫలితాలను ఇస్తుండడంతో ఇతర ఆఫీసుల్లోనూ ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.
ఇప్పటికే తిరుమలగిరిలో అందుబాటులోకి
సారథి సేవలు విస్తరించేందుకు రవాణా శాఖ రంగం సిద్ధం చేస్తోంది. సికింద్రాబాద్ తిరుమలగిరి రవాణా శాఖ కార్యాలయంలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన సేవలు సత్ఫలితాలను ఇస్తుండడంతో ఇతర ఆఫీసుల్లోనూ ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఖైరతాబాద్(Khairatabad)లోని రవాణా శాఖ కార్యాలయంలో వచ్చే వారం ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 25న ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు ఓ అధికారి తెలిపారు.
ఈ సేవలు అందుబాటులోకి వస్తే స్లాట్ బుక్ చేసుకొని కూర్చున్న చోటు నుంచే ఆన్లైన్లో లెర్నర్స్ లైసెన్స్ రిజిస్ర్టేషన్ (ఎల్ఎల్ఆర్) టెస్ట్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్లో చిరునామా మార్పు, పునరుద్ధరణ, ఇతరత్రా సేవలూ సులువుగా పొందే అవకాశముంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన పరివాహన్ సేవా పోర్టల్తో రాష్ట్ర రవాణా శాఖ వివరాలు అనుసంధానం చేస్తున్నారు. విడతల వారీగా నగరంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో సారథి సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.