‘భూభారతితో భూ సమస్యలు పరిష్కారమవుతాయి’
భూభారతితో భూములకు భరోసా
ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి
మహబూబ్ నగర్/ నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులతో కలిసి పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..భూ భారతి చట్టం ద్వారా భూ వివాదాలకు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందని, రైతుల భూములకు పూర్తి భరోసా లభిస్తుందని, రైతుల భూ సమస్యలు శాశ్వతంగా తీరుతాయని, ఇకపై గ్రామాల్లో భూ పంచాయితీలు, వివాదాలు ఉండవని అన్నారు. భూములకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతో భూ భారతి చట్టం, పోర్టల్ తెచ్చామని, భూ భారతిపై ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.

రైతులను మోసం చేయడానికే గత బీఆర్ఎస్ సర్కార్ ధరణి పోర్టల్ తెచ్చిందని, పేదలకు ఇచ్చిన భూములను సైతం ధరణి పేరుతో కొల్లగొట్టిందని ఆరోపించారు. ధరణి పేరుతో రైతులను, సామాన్యులను కోర్టుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేదాకా తిప్పిందని, 20 లక్షల ఎకరాలను ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని అన్నారు. సాదా బైనామాలతో పాటు ఇతర ఏ సమస్య ఉన్న పరిష్కరిస్తామని తెలిపారు. పేర్లు, సర్వే నంబర్లు, ఎకరాలు తప్పు పడినా గతంలో కార్యాలయాలు చుట్టూ తిరిగిన పనులు కాలేదని, ప్రస్తుతం చట్టం ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. ఒక్క రూపాయి చెల్లించకుండా రైతులు నేరుగా MRO, ఆర్డీవో, కలెక్టర్ల ద్వారా భూ సమస్యలు పరిష్కరించుకోవచ్చని సూచించారు. మే 1 నుంచి ప్రతి రెవెన్యూ గ్రామాలకు అధికారులు వచ్చి రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తారని తెలిపారు.
భూభారతి కింద భూముల వివరాలను డిజిటలైజేషన్ చేస్తామని, దీంతో భవిష్యత్లో రైతులకు భూ సమస్యలు, వివాదాలు రావన్నారు. భూభారతి చట్టం దేశానికి రోల్ మోడల్గా నిలుస్తుందని చెప్పారు, ఈ చట్టం ద్వారా భూములపై పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తాయన్నారు, ఈ పోర్టల్పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని కోరారు.