
District Collector Dr. Satya Sharada
భూభారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కారించాలి
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
నర్సంపేట/వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:
భూ భారతి రెవిన్యూ సదస్సులో ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తహసీల్దార్ లను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ లో మండల తహసీల్దార్ లతో భూ భారతి, రెవిన్యూ సదస్సు లో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధించిన అన్ని దరఖాస్తులను క్లియర్ చేయాలని అన్నారు.భూభారతి రెవిన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను కేటగిరీల వారీగా విభజిస్తూ సత్వరమే వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. ఆగస్టు 15 నాటికి అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చొరవ చూపాలన్నారు.
అన్ని మాడ్యుల్స్ లో దాఖలైన భూ భారతి దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపాలి అన్నారు.దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ జరపాలన్నారు. అవసరమైన రికార్డులను కూడా క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. రెవిన్యూ పరంగా ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి,డిఆర్ ఓ విజయలక్ష్మి,ఆర్డీవో లు సత్యపాల్ రెడ్డి, ఉమారాణి , కలెక్టరేట్ ఏఓ విశ్వ ప్రసాద్, తహసీల్దార్ లు పాల్గొన్నారు.