
Anirudh Reddy Slams KTR
కేటీఆర్ ప్రతీదీ రాజకీయం చేస్తున్నారు: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
కేటీఆర్ ప్రతిదీ రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే.. ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూ పైన మాట్లాడారా? అని ఆయన కేటీఆర్ను సూటిగా ప్రశ్నించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిదీ రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే.. ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూ పైన మాట్లాడారా? అని ఆయన కేటీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. ప్రజలకు కావాల్సిన అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏరోజైనా స్వేచ్ఛగా మాట్లాడారా? అని ఆయన నిలదీశారు.
మా(కాంగ్రెస్) పార్టీలో, మా ప్రభుత్వంలో స్వేచ్ఛ ఎక్కువ అని చెప్పిన అనిరుధ్ రెడ్డి.. ‘మా ప్రభుత్వానికి ప్రజలపై చిత్తశుద్ధి ఉంది. మీ పాలన.. నిరంకుశత్వ పాలన. మీది రౌడీయిజం పాలన. అది చూడలేకనే ప్రజలు మిమ్మల్ని.. మీ పార్టీని బొంద పెట్టారు. నేను పోరాటం చేసేది రైతుల కోసం, నా జడ్చర్ల నియోజకవర్గం ప్రజల కోసం. మీ ఎమ్మెల్యేలు రౌడీయిజం చేసేది ఫ్యాక్టరీల్లో వసూళ్ల కోసం, కమీషన్లు, భూకబ్జాల కోసం అని మీరు గమనించాలి’ అని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.తాను చెరువుల్లో చేపలు చనిపోతున్నాయని ముదిరాజుల కోసం ఫైట్ చేస్తున్నానని.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీల్లో పొల్యూషన్ వచ్చినా వాళ్లకు కమీషన్ వస్తే చాలని, ఎప్పుడు కూడా ఈ సమస్య పై మాట్లాడలేదని మీరు గుర్తించాలని అనిరుధ్ రెడ్డి.. కేటీఆర్ ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.