కాంగ్రెస్ పార్టీ కీలక నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్)గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రాంత వాసులకి అత్యంత సుపరిచితులైన మన డైనమిక్ లీడర్. ప్రస్తుతం ఆయన హై కమాండ్ ఆదేశాలతో ఎలక్షన్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఏక కాలంలో కేసీఆర్ క్యాబినెట్లోని ఇద్దరు మంత్రులు, ఒక మాజీ మంత్రి నియోజకవర్గాలపై గురి పెట్టారు. ఈ మూడింట్లో ఏదొక నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగుతారని కాంగ్రెస్లో ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వలస వెళ్లిన సబితా ఇంద్రా రెడ్డి ప్రస్తుతం మహేశ్వరం ప్రాంతంలో సెగ్మెంట్లోని ఆమె పనితీరు, లోటు పాట్లపై కేఎల్ఆర్ దృష్టి సారించారు. మంత్రిగా కూడా అధికారం వెలగబెడుతోన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు చేసిందేమీ లేదని తెలుస్తోంది. అలాగే, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మరో మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గంపై కూడా ఫోకస్ చేస్తున్నారు. మేడ్చల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆయన రేయింబవళ్లూ సీఎం కేసీఆర్, కేటీఆర్ భజనలో తరిస్తుంటారు. జనానికి చేసిన మేలు మాత్రం అంతంతమాత్రమే. రానున్న ఎన్నికల్లో కేఎల్ఆర్ను మేడ్చల్ నుంచి కూడా అధిష్టానం బరిలో దింపవచ్చట.
ఇక తాండూరులో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి లేదా సిట్టింగ్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని కిచ్చన్నగారి లక్ష్మారెట్టి ఢీకొట్టే అవకాశం ఉంది. మాజీ మంత్రిపై ఉన్న వ్యతిరేకతతో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డిని ప్రజలు గెలిపించారు. అయితే, ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా రోహిత్ రెడ్డి కాంగ్రెస్ను వీడడంతో పార్టీ క్యాడెర్, ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఒకవేళ కేఎల్ఆర్ ఇక్కడ నుంచి బరిలోకి దిగితే కేసీఆర్ టీమ్లోని బలమైన నేతగా ఉన్న మహేందర్ రెడ్డికి కష్టకాలం తప్పదని వినికిడి. మొత్తానికి ఈ మూడు స్థానాల్లో కేఎల్ఆర్ ఎక్కడ నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్కు ఒక సీటు కన్ ఫర్మ్ అని తెలుస్తోంది.