https://epaper.netidhatri.com/
`కేసిఆర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు
` రెండో సారి రాజ్యసభ అవకాశం వచ్చిన సందర్భంగా ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’తో ‘‘వద్దిరాజు రవిచంద్ర’’
ముఖాముఖి.
`తెలంగాణ ప్రజల్ని కళ్లలో పెట్టుకొని చూసుకున్నాడు.
`ఆరునెలల్లో తెలంగాణలో ఫ్లోరైడ్ లేకుండా చేశాడు.
`నేటితరాన్ని ఫ్లోరైడ్ నుంచి విముక్తి చేశాడు.
`కేసిఆర్ తండ్రితో సమానం,
`కేసిఆర్ పుట్టిన రోజుకు నాకు దక్కిన కానుక
`ఆయన ఆశీస్సులే రాజకీయ జీవితం.
`బిఆర్ఎస్ పార్టీయే నాకు సర్వస్వం.
`కేసిఆర్కు జీవితాంతం రుణపడి వుంటా
`ప్రజలు మార్పు కోరుకోలేదు.
`కాంగ్రెస్ చేసిన అసత్యాలు నమ్మిన్రు.
`ఇప్పుడు బాధపడుతున్నారు.
`మళ్ళీ కేసిఆర్ రావాలని కోరుకుంటున్నారు.
`పార్లమెంటు ఎన్నికలలో మెజారిటీ స్థానాలు మాకే.
`తెలంగాణ ప్రజలు కేసిఆర్ వైపే.
`మూడు నెలల్లో కాంగ్రెస్ బండారం బైటపడుతుంది.
`వారి చేతగాని తనం తేలిపోతుంది.
`కాంగ్రెస్ వస్తే కరంటు కష్టాలు తధ్యమన్నట్లే చూస్తున్నాం.
`పల్లెలు, పట్నాలు అన్న తేడా లేదు.
`కరంటు కోతలకు అడ్డూ అదుపు లేదు.
`మళ్ళీ మంచినీళ్ల కొరత వచ్చింది.
`సాగునీటి కరువు కాంగ్రెస్ తెచ్చింది.
`కాంగ్రెస్కు రైతు శాపం తప్పదు.
`ప్రజాగ్రహం త్వరలో చవిచూడక తప్పదు.
`కాంగ్రెస్ ప్రజా సేవ చేయడానికి అధికారంలోకి రాలేదు.
`అధికారం ఎంజాయ్ చేద్దామనుకుంటున్నారు.
`ప్రజలను కష్టాలపాలు చేద్దామని చూస్తున్నారు.
`తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బకొట్టాలని చూస్తున్నారు.
-మళ్ళీ కాంగ్రెస్ మీద ప్రజా తిరుగుబాటు తప్పదు.
హైదరబాద్,నేటిధాత్రి:
రామాయణం విన్నాం. రాజ రాజ్యం గురించి పెద్దలు చెబితే వింటున్నాం. గత రెండు నెలలు క్రితం వరకు కేసిఆర్ పాలనలో చూశాం. అరవైఏళ్లు కాంగ్రెస్ పెట్టిన గోసలు అనుభవించాం. తెలంగాణ ప్రజలు పడుతున్న బాధలు చూడలేక పోరాటం చేసి, తెలంగాణ తెచ్చి, పదేళ్లు ప్రజలను కన్న బిడ్డల వలే చూసుకున్న కేసిఆర్ను పాలన చూశాం. ప్రజలు చల్లగా వుండడం గిట్టన కాంగ్రెస్ అసత్యాలు ప్రచారం చేసింది. పదే పదే అబద్దాలు చెప్పి, చెప్పి ప్రజలను మభ్యపెట్టింది. రెండు నెలల క్రితం అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ మళ్లీ ప్రజలను కాల్చుకుతింటుంది. ప్రజలను అరిగోసపెడుతుంది. అందుకే ప్రజలు అయ్యో మన కేసిఆర్ను కాదనుకొని కష్టాలు కొని తెచ్చుకున్నామని మధనపడుతున్నారు. మళ్లీ కేసిఆర్ పాలన ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నారంటున్న రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, నేటిధాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావుతో ముఖాముఖి…ఆయన మాటల్లోనే…
ముందుగా మా పార్టీ జాతీయ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. సహజంగా మా అధినేత పుట్టిన రోజు వేడుకకు మేం శుభాకాంక్షలు తెలియజేస్తుంటాం. కాని తెలంగాణలో ఇప్పటి వరకు ఆయన పుట్టిన రోజు సందర్భంగా నాకు అందిన కానుక ఎవరికీ అందకపోవచ్చు. ఆయన పుట్టిన రోజు కానుకగా నాకు రాజ్యసభ అందించడం అన్నది నాకు ఎంతో సంతోషాన్ని కల్గించింది. రెండేళ్లక్రితం ఆయన నాకు మాటిచ్చారు. కాని మర్చిపోలేదు. రెండోసారి కూడా నాకే ఇస్తానని చెప్పినట్లే, రెండోసారి రాజ్యసభకు పంపిస్తున్నారు. ఆయన రుణం ఎన్ని జన్మలైనా తీర్చుకోలేనది. ఎందుకంటే గొప్ప వ్యక్తిత్వం కేసిఆర్ సొంతం. అందువల్లనే ఆయనను తెలంగాణ మొత్తం గుండెల్లో పెట్టుకున్నది. తెలంగాణ పితగా కీర్తిస్తున్నది. రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది కాలానికే తనను పార్టీలోకి రమ్మని, రాజ్యసభ ఇచ్చిన గౌరవించారు. రెండోసారి కూడా మళ్లీ నాకు అవకాశమిచ్చి నాపై ఆయనకు ఎంత ప్రేమ వుందో చూపించాడు. ఆయన ప్రేమను నేను నిలబెట్టుకుంటాను. నాకు కేసిఆర్ తండ్రితో సమానం. ఆయన ఆశీస్సులే నాకు రాజకీయం జీవితం. ఇకపై నేను శక్తి వంచన లేకుండా పార్టీకోసం నిరంతం పాటు పడతాను. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కారు జోరు ఏమిటో చూపిస్తాము. ఖమ్మం జిల్లాలో కారును పరుగులు పెట్టిస్తాము. అందర్నీ కలుపుకుపోతూ, సమన్వయపర్చుకుంటూ, క్యాడర్లో భరోసా నింపుతూ తెలంగాణలో బిఆర్ఎస్ బలం మరింత రెట్టింపు చేస్తాము. వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడే అన్నట్లు కారును తిరుగులేని శక్తిగా మార్చుతాము. ఇప్పటినుంచే ప్రణాళిక సిద్దం చేస్తాము. ముందుగా పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా పది సీట్లుకు పైగా గెలుస్తాం. ఎందుకంటే ప్రజల ఏమరపాటులో చేసిన ఆలోచనతో రెండు నెలల్లోనే సతమతమౌతున్నారు. రైతు బంధు అందలేదు. రెండు నెలలుగా ఆసరా పెన్షన్లు అందడం లేదు. ఉద్యోగులకు ఫస్టుకే జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కాళేశ్వరంపై లేని పోని అసత్యాలు ప్రచారం చేసి, రైతులను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారు. నీళ్లివ్వలేమని చేతులెత్తేశారు. దానికి తోడు ఎన్నికల ముందు ఇచ్చిన బోనస్ను గురించి మాట్లాడడం లేదు. ఇప్పటికే నిరుద్యోగ భృతికి మంగళం పాడారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం వచ్చిందే కాని, ప్రజలకు సేవ చేయడం కోసం కాదన్నది సుస్పష్టం. గడచిన రెండు నెలలుగా కేసిఆర్ చరిత్రను ఎలా చెరిపివేయాలన్న కుటిల నీతితో పనిచేస్తుందే తప్ప, తెలంగాణకు మేలు చేసే పనులకు పూనుకోవడం లేదు. తెలంగాణ చిహ్నం మార్చుతామంటారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులంటారు. మా ప్రభుత్వంలో పరీక్షలు పెట్టిన వాటికి ఫలితాలు ప్రకటించి ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన నాడే రైతు భరోసా 15వేలు ఇస్తామన్నారు. ఇచ్చారా? లేదు. డిసెంబర్ 9నాడే రుణమాఫీ చేస్తామన్నారు. ఆసరా పించన్లు పెంచుతామన్నారు. పెంచలేదు. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగ కల్పన నోటిఫికేషన్ వేయలేదు. కాని ప్రగల్భాలు మాత్రం బాగా పలుకుతున్నారు. నోటికి ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నారు. తెలంగాణ తెచ్చి, తెలంగాణను ఒక రాష్ట్ర్రంగా ఏర్పాటు చేయించి, అన్నపూర్ణగా మార్చిన కేసిఆర్ను దూషిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు మిడిసిపాటు తనమే వారికి భాస్మాసుర హస్తమౌతుంది.
తెలంగాణ కోసం ఒక్కడుగా బయలుదేరాడు. ఒక్కడే అడుగులు వేశాడు. ఒక్కడిగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. తెలంగాణ వచ్చేదాకా పోరాటం చేశాడు. ఉద్యమాన్ని ప్రపంచంలో ఎవరూ నిర్మించలేనన్ని రూపాలు అద్ది కార్యాసాధకుడయ్యాడు. రక రకాల రూపాలలో తెలంగాణ పోరాటాన్ని నిర్వహించారు. అలుపెరగని పోరాటం చేసి, తెలంగాణ శక్తులను ఏకం చేసి, జేఏసి ఏర్పాటు చేసి, నిరంతరం ఉద్యమానికి ఊపిరులూదుతూ తెలంగాణ వచ్చేదాకా తెగించి పోరాటం చేసిన నాయకుడు కేసిఆర్. అలాంటి కేసిఆర్ తెలంగాణ తెచ్చి, పదేళ్లు తెలంగాణను బంగారు మయం చేశారు. ఒక్కొక్క మెట్టు ఎక్కినట్లు, తెలంగాణకు వున్న సమస్యలను ఒక్కొక్కటిగా తీరుస్తూ, ప్రజలను కళ్లలో పెట్టుకొని చూసుకున్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లులో ఇన్ని అధ్భుతాలు కేసిఆర్ సృష్టిస్తాడని ఎవరూ కలలో కూడా అనుకోలేదు. తెలంగాణ వచ్చిన మూడు నెలల్లో పల్లె నుంచి పట్నం దాకా నిరంతరం కరంటు ఇవ్వడం అన్నది ఒక అధ్భుతం. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే కరంటు కష్టాలు. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కలిసిన తర్వాత ఏనాడు నిరంతర కరంటు చూసింది లేదు. పంటలు ఎండకుండా వున్నది లేదు. సరిగ్గా రెండు గంటల పాటు కరంటు కాంగ్రెస్ ఇచ్చింది లేదు. పట్టుమని పది నిమిషాలు కూడా కరంటు వుండని రోజుల నుంచి, కనురెప్ప పాటు కూడా కరంటు పోకుండా ఇచ్చిన ఘనత ఒక్క కేసిఆర్కే దక్కుతుంది. మళ్లీ కాంగ్రెస్ వచ్చింది. కరంటు కష్టాలు మొదలయ్యాయి. అటు రైతులకు, ఇటు గృహాలకు కోతలు మొదలయ్యాయి. వచ్చేది వేసవి. అప్పుడు జనాన్ని తిప్పలు పెడితే మాత్రం కేసిఆర్ ఊరుకోడు. బిఆర్ఎస్ శ్రేణులు ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రజలకు కళ్లబొల్లి మాటలు చెప్పి, మాయా మశ్చీంద్ర వేషాలు వేసి, మార్పు పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తీరు మారలేదు. వెనకటి గుణం మార్చుకోలేదు. అదే ధోరణి. ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన కాంగ్రెస్కు ఎప్పుడూ వుండదు. ఎంత సేపు పదవుల పంపకాలు. పదవుల కోసం కొట్లాటలు. ఆధిపత్యం కోసం ఆరాటలు. మధ్యలో ప్రజా సమస్యలు గాలికి వదిలేయడాలు..ఇంతకు మించి కాంగ్రెస్ నుంచి ఆశించలేం. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే కలహాల కాపురం. ఇల్లు చక్కదిద్దుకోవడం అంటే రాష్ట్రాన్ని బాగు చేయడంకాదు, తమ పదువులను కాపాడుకోవడం మాత్రమే కాంగ్రెస్కు తెలిసింది.
కేసిఆర్ అంటే తెలంగాణ కల. తెలంగాణ ఆవిష్కారం. అధ్భుతమైన ప్రగతికి తార్కాణం. అభివృద్దికి నిలయం. అరవై ఏళ్ల గోస తీర్చిన గొప్ప మహానుబావుడు కేసిఆర్. అసలు నల్లగొండ ప్లోరైడ్ మాసిపోతుందని ఎవరైనా కలగన్నారా? అలాంటి కలను తీర్చిన గొప్ప సంస్కర్త మన కేసిఆర్. అరవైఏళ్లపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రజలు నడుములు వండి, పసివయసులోనే వృద్యాప్య చాయలు వచ్చి, కూర్చుంటే నిలుచోరాకుండా, నిలుచుంటే కూర్చోరాకుండా, పడుకుంటే నిలబడలేకుండా నిత్యం నరకమనుభవించేవారు. ఎందుకు ఈ మానవ జన్మకొచ్చామని దినదిన గండంగా బతికేవారు. అది వారి తప్పు కాదు. పాలకుల తప్పు. నల్లగొండ జిల్లా నేతల తప్పు. వారి తప్పులకు ప్రజలన బలిచేశారు. తాగడానికి పనికి రాని మంచినీళ్లును తాగడం కన్నా, మూత్రం వడబోసుకొని తాగడం మేలని భావించిన రోజులనుంచి, స్వచ్ఛమైన మంచినీటి సరఫరా చేసి, తెలంగాణ పల్లెలకు సురక్షితమైన మంచినీరు కేసిఆర్ అందించారు. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టకమందే కేసిఆర్ నల్లగొండ ప్లోరైడ్ మీద పోరాటం మొదలుపెట్టాడు. పాలమూరు వలసలను ఆపాలని కంకణం కట్టుకున్నాడు. అదే ఆయన ఆచరించారు. తెలంగాణ వచ్చిన వెంటనే రూ.50 కోట్లతో మొదట మునుగోడు నియోజకవర్గంలో ప్లోరైడ్ పారద్రోలాడు.. తర్వాత మొత్తం తెలంగాణలో ఇంటింటికీ మంచినీరిచ్చే మిషన్ భగీరధతో తెలంగాణ నుంచి ప్లోరైడ్ బూతాన్ని తరిమేశాడు. నేటితరానికి ఫ్లోరైడ్ రహిత మంచినీటిని అందించి వారి జీవితాలలో వెలుగులు నింపాడు. ఇక భవిష్యత్తులో ఫ్లోరైడ్ అన్నది కలలో కూడా కనిపించకుండా చేశాడు. అదీ కేసిఆర్ అంటే…కాని మళ్లీ కాంగ్రెస్ వచ్చింది. మంచినీళ్లును కూడా అందించలేమంటోంది. అంటే ప్రజల నెత్తిమీద ఫ్లోరైడ్ బూతాన్ని పెట్టేందుకు కుట్ర చేస్తోంది. ఓ వైపు నల్లగొండలో ఫ్లోరైడ్ లేకుండా తరిమేస్తే, మంత్రి కోమటిరెడ్డి నిండు అసెంబ్లీలో అవాస్తవాలు మాట్లాడి ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడు. ఫ్లోరైడ్ పోలేదని మొసలి కన్నీరు కారుస్తున్నాడు. అరవైఏళ్ల ఉమ్మడి పాలకుల పాలనలో కునారిల్లిన నల్లగొండకు కేసిఆర్ కొత్త నడకలు నేర్పితే, కాంగ్రెస్ మళ్లీ అవిటితనం తేవాలని చూస్తోంది. నల్లగొండను మళ్లీ నిండా ముంచేందుకు కుట్రలు పన్నుతోంది. ప్రజలు సంతోషంగా వుండడం కాంగ్రెస్కు నచ్చదు. అందుకే ప్రజలను కష్టాలు పాలు చేయడానికి కుయుక్తులు పన్నుతోంది. కేసిఆర్ ను బద్నాం చేసి, రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. పరిపాలన చేతకాదని ఇప్పటికే కాంగ్రెస్ చేతులెత్తేసింది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద క్రాప్ హలిడే ప్రకటించింది. కానీ పదేళ్ల కాలంలో ఏనాడైనా కేసిఆర్ కరంటు ఇవ్వలేమని ఏనాడైనా చెప్పారా? నీళ్లు అందకపోవచ్చన్న మాటలెప్పుడైనా అన్నాడా? చివరి ఆయకట్టు వరకు నీళ్లు చేరాలన్నదే కేసిఆర్ సంకల్పం. చివరి మడి కూడా వరి పండాలన్నదే కేసిఆర్ ఆశయం. అలాగే ఏనాడు ఒక్క వరి కర్ర కూడా ఎండకుండా చూసుకున్నాడు. అవసరమైన నీళ్లును ఎప్పటికిప్పుడు సరఫరా చేశారు. చెరువుల్లో చుక్క నీరు తగ్గకుండా చూసుకున్నారు. తెలంగాణలో భూగర్భ జలాల మట్టం పెంచి, తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేశాడు. అదీ కేసిఆర్ అంటే..