ప్రజలను దోచుకుతినడానికే కవిత కొత్త పార్టీ
తెలంగాణ రక్షణ సేన కాదు.. అది తెలంగాణ రాక్షస సేన
ఆ పార్టీలో చేరిన వారందరూ ప్రజలను దోచుకుతినే రాక్షసులు
అధికారంలో ఉన్న పదేళ్లు కవిత ఎందుకు మాట్లాడలేదు
కాళేశ్వరంలో దోచుకుతింటున్నారని అప్పుడే ఎందుకు చెప్పలేదు
ఇప్పుడు దోచుకుతినడానికే కొత్త పార్టీ పెట్టారు
కవిత కొత్త పార్టీపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హాట్ కామెంట్స్
జడ్చర్ల /నేటి ధాత్రి.
కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీ తెలంగాణ రక్షణ సేన కాదని, అది తెలంగాణ రాక్షస సేన అని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి విమర్శించారు. జన్మనిచ్చి, జీవితాన్ని ఇచ్చిన తండ్రి మీదనే కొట్లాడుతున్న కవిత తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాక్షస సేన పార్టీలో చేరిన వారందరూ ప్రజల్ని దోచుకుతినే రాక్షసులే అని హాట్ కామెంట్స్ చేసారు. రాజాపూర్ మండలంలోని కుచ్చర్కల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం నాడు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. కల్వకుంట్ల కవిత మీద, ఆమె ఏర్పాటు చేసిన కొత్త రాజకీయపార్టీ మీద హాట్ కామెంట్స్ చేసారు. కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించి ఇప్పుడు రెండు పార్టీలు అయ్యాయని, ఒక వైపు బీఆర్ఎస్, మరోవైపు టీఆర్ఎస్ పార్టీలుగా ఏర్పడ్డాయని చెప్పారు. కవిత కొత్తగా పెట్టిన పార్టీ పేరు ఏమిటని ఆరా తీసిన ఎమ్మెల్యేకి అక్కడున్న నేత ఒకరు కొత్త పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన అని చెప్పగా, అది తెలంగాణ రక్షణ సేన కాదది, తెలంగాణ రాక్షస సేన పార్టీ అంటూ అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కొత్త పార్టీ దేనికి అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. ‘ మీ నాయిన పదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఆ రోజు ఎందుకు కొట్లాడలేదు.. కాళేశ్వరంలో దోచుకుంటున్నారని ఎందుకు మాట్లాడలేదు..’ అని కల్వకుంట్ల కవితను సూటిగా ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ మాట్లాడకుండా.. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు తమదేమీ సాగడం లేదని, కొత్త పార్టీ పెట్టి ఆ పార్టీ పేరు చెప్పి ఫ్యాక్టరీల దగ్గర, ఇతరుల దగ్గర దోచుకోవచ్చని ఈ కొత్త పార్టీ పెట్టారా? అని నిలదీసారు. తెలంగాణ రాక్షస సేన పార్టీలో చేరిన వారందరూ కూడా రాక్షసులని, ప్రజలను దోచుకోవడమే వారి లక్ష్యమని విమర్శించారు. ఒక తండ్రి పిల్లలకు వారు కోరింది చేసి, వారికి జీవితాన్ని ఇస్తాడని, అలాంటి తండ్రి మీదనే కొట్లాడుతున్న కవిత తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీలు పేద ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో పుట్టిన పార్టీలు కాదని, ప్రజలను దోచుకుతినడానికి పుట్టిన పార్టీలు మాత్రమేకానీ పేద ప్రజలకు న్యాయం చేసే పార్టీలు కావని అనిరుధ్ రెడ్డి దుయ్యబట్టారు.
