ఇంత కాలం ఆగి..ఇప్పుడే ఎందుకు?
బిజేపి అత్యాశ…తెలంగాణలో దేవులాట!
రాజకీయం తప్ప నైతికత వుందా?
బిజేపి ఒత్తిడితోనే కవిత అరెస్టు?
కేసిఆర్ ఆత్మస్థైర్యంపై బిజేపి ఆట!
చంద్రబాబు బిజేపి తో కలిశాకనే కదలిక.
బిఆర్ఎస్ ను ఖతంచేసి..బిజేపి బలపడాలనే కుట్ర?
కవిత అరెస్టు అందులో భాగమే!
ఏడాదిన్నర తర్వాత అరెస్టు ఒక వ్యూహమే!
రాజకీయంగా బిఆర్ఎస్ను దెబ్బకొట్టాలనే..
ఇప్పటి దాకా ఆగి…ఇప్పుడు అదును చూసి.
కేసిఆర్ వ్యూహాలపై వేట.
కేసిఆర్ను కట్టడికి ప్రణాళిక.
ఓడిపోయినప్పుడే ఒత్తేయాలని నిఘా.
ఎన్నికల సమయంలో కేసిఆర్ చేతులు కట్టేసే ప్రయత్నం.
ఇది తెలంగాణ జనం ప్రశ్న.
నాది అక్రమ అరెస్టు. శనివారం డిల్లీలో కోర్టుకు హజరయ్యే సమయంలో చుట్టుముట్టి ప్రశ్నించిన మీడియాకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధైర్యంగా చెప్పిన ఒకే ఒక్క మాట. కవితలో కుంగుబాటు లేదు. గొంతులో తడబాటు లేదు. అరెస్టయ్యానన్న భయం లేదు. న్యాయం తన వైపే వుందన్న నమ్మకం తోడుగా ఆమె ఈ వ్యాఖ్య చేసింది. తెలంగాణ గుండె ధైర్యం మరోసారి చూపించింది. వీరనారిలా తన అరెస్టును ఒక్క మాటలో ప్రశ్నించింది. తేల్చేసింది. తన అరెస్టు ఇల్లీగల్ అనుకుంటూ ముందుకు సాగింది. దటీజ్ పవర్ ఆఫ్ తెలంగాణ వాయిస్ అన్నట్లు వినిపించింది. ఎందుకంటే ఆరోపణలన్నీ నిజం కావు. రాజకీయ కక్షపూరిత వేధింపులు ఎప్పటికీ నిలబడవు. అబాండాలు రుజువు కావు. క్షక్ష సాధింపు చర్యలు ఎప్పటికీ ఫలించవు. విమర్శలు ఎప్పుడూ నీటి మీద రాతలే. ఎత్తిపొడుపులు పొద్దుపొడుపులు కావు. అరెస్టులన్నీ నిలబడవు. ఆత్మ స్ధైర్యం ముందు బలాదూర్. రాజకీయాలన్నీ శాశ్వతం కాదు. పదవులెవ్వరికీ జీవితాంతం తోడు కావు. కేంద్రాన్ని ఏలుతున్న వారే ఎప్పుడూ అధికారంలోనే వుండరు. పగలు, ప్రతీకారాలకు రాజకీయాల్లో చోటు లేదు. రాత్రి పగలు వున్నట్లే, ప్రతి పార్టీకి వెలుగు నీడలుంటాయి. అపనిందలు పడుతూనే వుంటాయి. నిజాయితీగా పనిచేసేవారిని వెంటాడుతూనే వుంటాయి. కాని వ్యవస్ధలో కలతలు రావొద్దు. ఆత్మహత్యా సదృష్యాలు కావొద్దు. ఇప్పుడు బిజేపి చేస్తున్నది అదే..బిజేపి హయాంలో కలుపుకుపోయే రాజకీయాలు మాయమయ్యాయి. కెలుక్కుంటూ వెళ్లే రాజకీయాలే కనిపిస్తున్నాయి. అవే రాజ్యమేలుతున్నాయి. పదేళ్లు అధికారంలో వుండడం పెద్ద గొప్పకాదు. గతంలో ఇంతకంటే ఎక్కువ కాలం రాజ్యమేలిన పార్టీలున్నాయి. కాని బిజేపిలాగా మిడిసిపడలేదు. పదేళ్లకే అహం బ్రహ్మాస్మి అన్నంత భ్రమలో బతకలేదు. బిజేపి మూలంగా మంచికి కూడా బురద రుద్దే దౌర్భాగ్యపు రాజకీయాలు కమ్ముకుంటున్నాయి. బిజేపి మూలంగా దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు మనుగడ కోల్పోతున్నాయి.
దేశంలో ప్రాంతీయ పార్టీలు వుండొద్దు. కొత్తవి రావొద్దు. అవి ఎదగొద్దు. జాతీయ స్ధాయిదాక విస్తరించొద్దు. ముఖ్యంగా దక్షిణాది రాజకీయాలు డిల్లీ వైపు చూడొద్దు. ప్రజాదరణ పొందొద్దు. కేంద్రంలో కొత్తగా జాతీయ పార్టీలు పురుడు పోసుకోవద్దు. బిజేపిని మించి పోవద్దు. కాంగ్రెస్ను దాటి రావొద్దు. మొత్తంగా జాతీయ రాజకీయాలలో ప్రాంతీయ పార్టీలు వేలు పెట్టొద్దు. కూర్చోమంటే కూర్చోవాలి. నిలుచో అంటే నిలుచోవాలి. అంతే కాని డిల్లీలో రాజకీయం చేయొద్దు. ఎదుగొద్దు. బిజేపి పెద్దలు చెప్పినట్లు తలూపితే చాలు.. వాళ్లు వద్దనుకుంటే రాజకీయంగా కనుమరుగైతేనే మేలు..ఇది బిజేపి అనుసరిస్తున్న సిద్దాంతం.. నిజానికి బిజేపి తన సిద్దాతాంతాలను ఎప్పుడో తుంగలో తొక్కింది. ఆరెస్సెస్ భావజాలాన్ని కమ్మేసింది. ముఖ్యంగా ప్రధాని మోడీ చెప్పిన సూత్రమే నడుస్తోంది. ఆయన తప్ప మరో వ్యక్తి, పార్టీ కనిపించొద్దన్న ఆధిపత్యమే కొనసాగుతోంది. అందులో భాగంగానే కవితను ముందు పెట్టి తెలంగాణ రాజకీయాలలో బిఆర్ఎస్ను అంతం చేయాలని కుట్ర పన్నుతున్నారు. రెండేళ్ల క్రితం వెలుగులోకి తెచ్చిన సంగతి నాన్చి, నాన్చి ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు కవితను అరెస్టు చేశారు. ముఖ్యంగా మనీ లాండరింగ్ కేసులో చట్టాలను అడ్డం పెట్టుకొని రాజకీయ క్షక్ష సాధింపు చర్యలు నైతికం కాదు. దక్షిణాదిన బిజేపి పాగా వేయాలి. అది రాజకీయంగా జరగాలి. ప్రజాస్వామ్య బద్దంగా జరగాలి. ప్రజల మనసు చూరగొని సాగాలి. ప్రజల మనసు గెల్చుకొని గెలవాలి.
తెలంగాణలో బిజేపి పాగా అన్నది ఒక రకంగా అత్యాశే. దేశ వ్యాప్తంగా ముఖ్యంగా ఇంత కాలం ఉత్తరాధిన ఊపులో వున్నట్లు, బిజేపికి వ్యతిరేకత లేదన్నట్లు వుండి ఒక్కసారిగా ఆ పార్టీకి ఏమైంది? మోడీ ప్రభ ఎందుకు మసకబారుతోంది? బిజేపిలోనే మోడీ ప్రభావం మెల్లిగా తగ్గుతోంది. నిజానికి యూపిఏ2 తర్వాత బిజేపికి కాలం కలిసొచ్చింది. మోడీ మంత్రం ఉత్తరాదిన జపమైంది. అంతో ఇంతో దక్షిణాది కూడ కలిసి వచ్చింది. ఇక అదికారంలో వున్నప్పుడు హైందవాన్ని ముందు పెట్టుకొని మరింత రాజకీయం చేయాలని చూశారు. గత పదేళ్లుగా అనుకున్నది సాధించుకున్నారు. కాని ప్రజల్లో పదే పదే మతం ముసుగు తప్ప, ప్రగతి భావజాలం బిజేపి వదిలేసిందన్నది తేలిపోయింది. ప్రజలు అభివృద్ది కోరుకునే దశగా ఆలోచనలు చేస్తున్నారు. నిజానికి బిజేపిని రామజన్మభూమి జపం నిలబెట్టింది. ఇప్పుడు అదే బిజేపి తిరోగమనానికి కారణమౌతోంది. రామ మందిర నిర్మాణం దేశమంతా ప్రశంసించింది. కాని ఆ ప్రభావం బిజేపికి అనుకూలంగా మారినట్లు కనిపించడం లేదు. అందుకే బిజేపి కొత్త ఎత్తులకు, పొత్తులకు ఎదురుచూస్తోంది. ఓ వైపు ఈసారి 400 సీట్లు సాదిస్తామంటూ ప్రగల్భాలు పలుకుతోంది. మరో వైపు పొత్తుల కోసం వెంపర్లాడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఉత్తరాదిన బిజేపి ఆశలు వదిలేసుకున్నది. ఇప్పుడు దక్షినాధిన పడిరది.
ఆంద్రప్రదేశ్లో బిజేపికి పెద్దగా ఆశలు లేవు. కాని తెలుగుదేశం, జనసేన జతతో చిరు ఆశలతో వుంది. కాని తెలంగాణలో రాష్ట్ర నాయకులు మూలంగా తన గోతిని తాను బిజేపి తవ్వుకుంటోంది. గత శాసన సభ ఎన్నికల్లో బిజేపి గెలుస్తుందన్న భ్రమలు పటాపంచెలయ్యాయి. కర్నాటకలో కాంగ్రెస్ గెలుపుతో ఆశనిపాతం మిగిలిన, బిజేపి కవిత ఆరెస్టు ఆనాడే జరిగితే బిజేపి అదికారంలోకి వచ్చేదన్న వాదనకు బలం పెంచారు. రాష్ట్ర బిజేపి నాయకులు కేంద్ర పెద్దలచెవిలో జోరిగలుగా మోత మోగించారు. శాసన సభ ఎన్నికలకు ముందు రెండేళ్లుగా కేసిఆర్ అరెస్టు, కేటిఆర్ అరెస్టు, కవిత లిక్కర్ కేసులో అరెస్టు అంటూ నిత్యం వివాదాలు రేపేవారు. కేవలం కవిత అరెస్టు ఆగడం వల్లనే తెలంగాణలో అదికారంలోకి రాలేదన్న వాదనను కేంద్ర పెద్దల ముందు పెట్టి, కవిత అరెస్టు దాకా తెచ్చారు. రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు.
తెలంగాణలో బిఆర్ఎస్ను అంతం చేయడం అన్నది బ్రహ్మతరం కూడా కాదు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు బలంగా వున్న దక్షిణాదిన బిజేపికి స్ధానం వుండదు. దక్షిణాదిన రాజకీయం చైతన్యం ఎక్కువ. ఉద్యమాల ఉనికి వుంటుంది. పోరాటాల చరిత్ర వుంటుంది. స్వశక్తి మీద జీవించాలన్న పట్టుదల వుంటుంది. విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులుంటాయి. యువతలో వివేకం, చైతన్యం వుంటుంది. వాటిని నమ్ముకోకుండా, కేవలం ఆరోపణలు,అరెస్టులతో ప్రాంతీయ పార్టీలను బలహీనం చేయాలని చూస్తే దక్షిణాది జనం అంగీకరించరు. పార్టీ కార్యకర్తలు, నాయకులు చెప్పే విషయాలలో నిజా నిజాలను గ్రహించకుండా నిర్ణయాలుతీసుకుంటే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు. కవిత అరెస్టుతో కేసిఆర్ను కట్టడి చేయొచ్చన్న ఆలోచనే బిజేపి పతనానికి నాందిగా మారనున్నది. కేసిఆర్ తెలంగాణకు మార్గం. ఆత్మగౌరవానికి నిదర్శనం. ఆయనను రాజకీయంగా దెబ్బకొట్టాలంటే ఆయనను మించిన సంక్షేమం చేసి చూపించాలి. కాని కేసిఆర్ను వ్యక్తిగతంగా దెబ్బతీయాలని చూస్తే రక్షణ కవచం తెలంగాణ సమాజమే నిలబడుతుంది. అది తెలుసుకోకుండా బిజేపి ముందుకెళ్లింది. శాసన సభ ఎన్నికల ముందు చేసిన తప్పిదం ఇప్పుడు చేస్తే పార్లమెంటు సీట్లు ఆగమౌతాయనుకున్నారు. ఎన్నికల సమయంలో కేసిఆర్ కట్టడి చేయాలని పగటి కలలు కంటున్నారు. ఈడీ వస్తుందా? బోడి వస్తుందా? అని సవాలు చేసిన కేసిఆర్ను కట్టుదిట్టం చేస్తాం..కాళ్లు చేతులు కట్టేస్తామంటే…కుదిరే పనికాదు. కేసిఆర్ను రాజకీయంగా అణిచి వేయడం ఎవరి వల్లా కాదు. కవితను అరెస్టు చేసి, కేసిఆర్ను మరింత నిద్రలేపారు..ఆయనను పగపట్టామని అనుకుంటున్నారు. కాని కేసిఆర్ను దెబ్బకొట్టడం బిజేపి వల్ల కాదు.