కోలీవుడ్ హీరో ఆర్య ఇంట్లో ఐటీ దాడులు..

కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య(Arya) నివాసంలో ఐటీ దాడులు నిర్వహించారు.
కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య(Arya) నివాసంలో ఐటీ దాడులు నిర్వహించారు. ఎప్పటికప్పుడు ఆర్య ఇలాంటి వివాదాల్లోనే ఇరుక్కుంటూ ఉంటాడు. గతంలో ఒక మహిళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఒక వ్యాపారవేత్తతో కలిసి రెస్టారెంట్ బిజినెస్ చేస్తూ పన్ను ఎగ్గొట్టినట్లు గుర్తించిన అధికారులు నేడు ఆయనకు సంబంధించిన వ్యాపార సంస్థలతో పాటు నివాసంలో కూడా ఐటీ దాడులను నిర్వహించారు. చెన్నైలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సీ షెల్ రెస్టారెంట్స్ లో కూడా ఈ దాడులను నిర్వహిస్తున్నారు.
చెన్నైలోని అన్నా నగర్, కొట్టివాకం వేలచెరి, కిల్పాక్ ప్రాంతాల్లో ఉన్న సీ షెల్ రెస్టారెంట్స్ లో కూడా ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ రెస్టారెంట్ చైన్ కు ఆర్యకు సంబంధం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే గతంలో ఈ రెస్టారెంట్స్ అన్నింటిని.. వ్యాపారవేత్త అయినా కున్హి మూసాకు విక్రయించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక కున్హి మూసా పై ఐటీ అధికారులు నిఘా పెట్టడంతో అది ఆర్య వరకు తీసుకొచ్చిందని సమాచారం. అందుకే ఆయన ఆఫీస్, ఇంట్లో కూడా అధికారులు దాడులను నిర్వహించారు. ఇంకోపక్క ఆర్య తన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడని, అంతేకాకుండా పన్ను కట్టకుండా తిరుగుతున్నాడని కూడా అధికారులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ దాడుల గురించి ఆర్య మాట్లాడుతూ.. ” ఆ రెస్టారెంట్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ రెస్టారెంట్ యజమాని నేను కాదు.. అతను వేరే వ్యక్తి.” అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక ఆర్య గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. రాజారాణి సినిమాతో ఆర్య తెలుగువారికి బాగా దగ్గరయ్యాడు. తెలుగులో అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు. ఇక ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్బింగ్ అవుతూ వస్తుంది. ఇక ఆర్య ఒకపక్క హీరోగా.. ఇంకోపక్క నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. తెలుగులో ఆయన చివరగా నిర్మించిన సినిమా ఎనిమీ. విశాల్, ఆర్య నటించిన ఈ సినిమా తమిళ్ లో విజయాన్ని అందుకుంది కానీ తెలుగులో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
ఇక ఆర్య.. హీరోయిన్ సయేషా సైగల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సయేషా తెలుగులో అక్కినేని అఖిల్ డెబ్యూ చిత్రంగా వచ్చిన అఖిల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఇక అఖిల్ తరువాత సయేషా తెలుగులో కనిపించలేదు. ఈ జంటకు ఒక పాప కూడా ఉంది. ప్రస్తుతం సయేషా రీఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తోంది.