జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
ప్రజలు ప్రతి పండుగను కలిసి జరుపుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. క్రిస్మస్ వేడుకలలో భాగంగా రామకృష్ణాపూర్ లోని సి.ఎస్.ఐ. చర్చ్ లో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందు కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వివేకానంద, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ రాజు, చైర్ పర్సన్ జంగం కళ లతో కలిసి పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా ప్రతి పండుగను అందరు కలిసి వేడుకగా జరుపుకోవడం సంతోషంగా ఉందని, దసరా, దీపావళి, సంక్రాంతి, మొహర్రం, రంజాన్, క్రిస్మస్ వంటి ప్రతి పండుగకు ప్రజలు ఆనందంగా ఉండేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. శాంతియుత వాతావరణంలో ప్రజలందరు కలిసి పండుగలు జరుపుకోవడం మంచి విషయమని అన్నారు. ఈ నెల 25న క్రిస్మస్ పండుగ వేడుకలను ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అందించే కానుకలను క్రైస్తవులకు అందించారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, పిసిసి కార్యదర్శి రఘునాథరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు గోపతి రాజయ్య, అబ్దుల్ అజీజ్, వొడ్నాల శ్రీనివాస్, సంబంధిత అధికారులు, పాస్టర్లు, కాంగ్రెస్ నాయకులు, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.