Police Crack Down on Ganja Supply Targeting IT Employees
ఐటీ ఉద్యోగులే టార్గెట్గా గంజాయి సరఫరా.. చెక్ పెట్టిన పోలీసులు
హైదరాబాద్లో అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 19: రాష్ట్రంలో గంజాయి సరఫరాను అడ్డుకునేందుకు పోలీసులు అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. గంజాయిని అమ్ముతున్నా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ ఎక్కడో చోట గంజాయి సరఫరా జరుగుతూ పట్టుబడటం పోలీసులకు సవాల్గా మారింది. తాజాగా రాయదుర్గం పోలీస్స్టేషన్లో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ ఉద్యోగులే టార్గెట్గా గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు.. గంజాయి సరఫరా చేస్తున్న సోహెల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుని వద్ద నుంచి 17 కేజీల గంజాయి, 2 గ్రాముల ఎండీఎంఏ (MDMA) డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి గంజాయి తెచ్చి ఐటీ ఉద్యోగులకు నిందితుడు సోహెల్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. సోహెల్తో పాటు గంజాయి వినియోగించిన ఐదు మంది కన్స్యూమర్లను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
