Farmer Alleges Injustice in IT Park Land Acquisition
ఐటీ పార్క్ భూసేకరణలో రైతుకు అన్యాయం
న్యాయం చేయాలని కలెక్టర్ ను ఆశ్రయించిన బాధితుడు
మంచిర్యాల,నేటి ధాత్రి:
హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామంలో ఐటీ పార్క్ భూసేకరణలో తీవ్ర అన్యాయం జరిగిందని బాధిత రైతు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు.తనకి వాస్తవంగా (నక్ష ప్రకారం) ఐదు ఎకరాలకు పైగా భూమి ఉన్నప్పటికీ,అధికారుల నిర్లక్ష్యంతో కేవలం ఒక ఎకరానికి మాత్రమే నష్టపరిహారం చెల్లించారని ఆవేదన వ్యక్తం చేశారు.వేంపల్లి గ్రామ రెవెన్యూ శివారు సర్వే నెంబర్ 159/37లో తన కుటుంబం సంవత్సరాలుగా నిరంతరంగా భూమిని సాగు చేస్తోందని,వాస్తవ స్వాధీనంలో ఉన్న మొత్తం విస్తీర్ణం 5 ఎకరాలు 02 గుంటలుగా ఉందని ఆయన పేర్కొన్నారు.అయితే పాస్బుక్లో ఒక్క ఎకరం 01 గుంట మాత్రమే నమోదై ఉండటాన్ని కారణంగా చూపి,మిగతా భూమికి నష్టపరిహారం ఇవ్వకుండా అధికారులు చేతులు దులుపుకున్నారని తెలిపారు.భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ తమకు వ్యక్తిగతంగా అందలేదని,గ్రామ స్థాయిలో కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని బాధితుడు ఆరోపించారు.కేవలం పత్రిక ప్రకటనకే పరిమితం కావడంతో అభ్యంతరాలు తెలిపే అవకాశం కోల్పోయామని పేర్కొన్నారు.అలాగే ప్రాథమిక విచారణ నివేదికలో కూడా వాస్తవ స్థితిని పక్కనపెట్టి,యాంత్రికంగా ఒక ఎకరం మాత్రమే చూపడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని వివరించారు.ఇదే భూసేకరణలో తమలాంటి పరిస్థితిలో ఉన్న ఇతర రైతులకు నక్ష ఆధారంగా పూర్తి నష్టపరిహారం చెల్లించగా,తన విషయంలో మాత్రం వివక్ష చూపారని ఆయన వాపోయారు.భూసేకరణ ‘కాన్సెంట్ అవార్డు’ పేరిట జరిగిందని చెబుతున్నా తన నుంచి స్వచ్ఛంద సమ్మతి తీసుకోలేదని,ఒత్తిడితో సంతకాలు సేకరించారని ఆరోపించారు.ఈ నేపథ్యంలో మిగిలిన భూమికి కూడా నక్షా ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని లేదా స్పష్టమైన కారణాలతో రాతపూర్వక ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు.జిల్లా స్థాయిలో స్వతంత్ర విచారణ జరిపి న్యాయం చేయాలని ఆయన కోరారు.
