నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు….
– ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలి….
– మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్…
కొల్చారం, (మెదక్) నేటిధాత్రి :-
నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా పటిష్ట చర్యలు
తీసుకుంటున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. శనివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామంలో గృహ నిర్మాణ శాఖ, మండల ప్రత్యేక అధికారులు, ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల విచారణ ప్రత్యేక అధికారులతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ
ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అర్హులైన కుటుంబాలకు న్యాయం జరగేలా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా మరియు సమగ్రంగా నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమం ద్వారా నిజంగా అవసరమైన ఇండ్లు లేని పేద కుటుంబాలకు ఇండ్లు ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. గ్రామ, వార్డు స్థాయిలో అర్హులైన దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించి, వారిని ఎంపిక చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు లక్ష్యాల వారీగా నిర్దేశించుకొని అర్హుల ఎంపికను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనలో ఎక్కడా కూడా ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా క్షేత్రస్థాయిలో సజావుగా సర్వే చేయాలని, ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా..అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు అందేలా చూడాలని స్పష్టం చేశారు.
అలాగే సర్వే చేసిన వివరాల పత్రాలను అత్యంత జాగ్రత్తగా భద్రపరచాలన్నారు. పరిశీలన చేసే క్రమంలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకూడదని, సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ చేయడం జరుగుతుందని ఏదేని అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
గ్రామాల వారీగా పరిశీలన పూర్తి కాగానే మొదటి విడత లో ఎంపిక చేసిన అర్హుల జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయంలోని నోటీసు బోర్డులో ప్రదర్శించాలని వెల్లడించారు.
ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు తక్షణమే నిర్మాణం చేపట్టేలా అవగహన కల్పించాలని అన్నారు. విడతల వారిగా నిధులు మంజూరు చేయడం జరుగుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.