
New Panchayat Building Inaugurated in Bhoopalapalli
గ్రామపంచాయతీ భవనమును ప్రారంభం
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
పల్లెలు మురిసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనుల జాతర 2025 కార్యక్రమాన్ని చేపట్టినట్లు భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు
టేకుమట్ల మండలం మందవారిపల్లిలో 20 లక్షల ఉపాధిహామీ పథకం నిధులతో
నిర్మించిన గ్రామ పంచాయతి భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఉపాధిహామీ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల ద్వారా చేపట్ట బోయే కొత్త పనులను ఏకకాలంలో ప్రారంభించటానికి పనుల జాతర-2025 కార్యక్రమానికి
శుక్రవారం శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా గతంలో పూర్తయిన పనులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. కొత్త పనులకు భూమిపూజతో చేపట్టిన అన్ని పనులు రానున్న సంవత్సరం మార్చి చివరి నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అవసరమైన గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్లాస్టిక్ మేనేజ్మెంట్ యూనిట్లు, సెగ్రిగేషన్ షెడ్లు, కమ్యూనిటీ శాని టరీ కాంప్లెక్స్ లు, గ్రామీణ రహదారుల నిర్మాణానికి ప్రజాప్రతినిధులు శంకుస్ధాపనలు చేసినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే పూర్తయిన పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. ఇందిరా మహిళాశక్తి ఉపాధి భరోసా కింద చేపట్టే జీవనోపాధి కార్యక్రమాలు, మహిళా సంఘాలకు కోళ్లు, పశువుల, గొర్రెల షెడ్లు, వ్యవసాయ బావుల నిర్మాణంతో పాటు పండ్ల తోటల పెంపకం, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు వంటి పనుల మంజూరు పత్రాలు అందచేశారు. ఫల వనం.. వనమహోత్సం కింద ఈత, తాటి, పండ్లతోటల పెంపకం చేపట్టే లబ్ధిదారులను గుర్తిస్తామని తెలిపారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పల్లెల్లో నూతన పనులు ప్రారంభించేందుకు.. వాటిని పూర్తిచేసేందుకు అధికారులు ప్రణాళికలు తయారు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులకు బాటలు పడనున్నాయని, ఉపాధి హామీ కూలీలు, స్వయం ఉపాధి పొందేవారికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగకరమైనదని ఎమ్మెల్యే అన్నారు
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో 1075 పనులను పనుల జాతర కార్యక్రమం ద్వారా చేపట్టినట్లు తెలిపారు. .ఇందుకోసం 3.93 కోట్లు అంచనా తయారు చేసినట్లు తెలిపారు. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీన్ లో 375 పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ
ఉపాధి పనిదినాలు చేసిన దివ్యాంగుల కుటుంబాలు, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న పంచాయతీ సిబ్బందిని, భూగర్భజలాలు, చెట్ల పెంపకంలో భాగస్వాములయిన వారిని సన్మానించామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీన్ పనులు, పల్లె ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిఆర్డీఓ బాలకృష్ణ, డిపిఓ శ్రీలత, పీఆర్ ఈ ఈ వెంకటేశ్వర్లు, ఎంపిడీవోలు అనిత, జయశ్రీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ మాజీ జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.