కాంగ్రెస్‌ ను నమ్మితే ఖతమే! బతుకులు తలకిందులే!!

https://epaper.netidhatri.com/

కొత్తగూడెం,ఇల్లందు బిఆర్‌ఎస్‌ ఇంచార్జ్‌,రాజ్యసభ సభ్యుడు ‘‘వద్దిరాజు రవిచంద్ర’’ నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్ట రాఘవేందర్‌ రావు’’ తో ‘‘చిట్‌ చాట్‌’’ ఆయన మాటల్లోనే..

` వ్యవసాయం ఆగమే!

`మళ్ళీ కరంటు కోతలే!

`కరువు కాలం కోరి తెచ్చుకునుడే?

`నిత్యం అధికారం కోసం కొట్లాటే!

`పాలన గాలికే!

`సంక్షేమం సమాధే!

`పథకాలన్నీ పక్కకు పెట్టుడే!

`మూడు గంటల కరంటే!

`బావుల కాడ మోటర్లకు మీటర్లు పెట్టుడే!

`తెలంగాణ అల్లకల్లోలమే!

`అంతా కలహాల కుమ్ములాటలే!

`సఖ్యతలేని రాజకీయ కాపురమే!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కాంగ్రెస్‌ను నమ్మితే తెలంగాణ ఆగమే..బతుకులు ఆగమాగమే! తెలంగాణ జీవనం తలకిందులే!! తెలంగాణను ఆదరిస్తే మళ్లీ యాభై ఏళ్లు వెనక్కె..ఎందుకంటే పదేళ్లలో మన తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనతో తెలంగాణ వుందో? కాంగ్రెస్‌, బిజేపి పాలిత రాష్ట్రాలలో పరిస్ధితులు ఎలా వున్నాయో? తెలుసుకోవాలి. కొట్లాడి తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనలో పదేళ్లలో జరిగిన అభివృద్ది అంతా ఇంతా కాదు. అసలు మనం తెలంగాణలోనే వున్నామా? అన్నంత ఆశ్చర్యం అప్పుడప్పుడూ వేస్తుంది. హైదరాబాద్‌లో తిరుగుతుంటే ఎక్కడున్నామన్న అనుమానం కలుగుతుంది. అంతలా తెలంగాణను, హైదరాబాద్‌ను మార్చివేశారు. ప్రగతిని పరుగులుపెట్టించారు. పదేళ్లలో అద్భుతమైన ప్రణాళికా బద్దమైన సమ్మిళితమైన, సుసంపన్నమైన అభివృద్దిని మన కళ్ల ముందు నిలిపారు. అదీ కేసిఆర్‌ పాలన. కాంగ్రెస్‌ నాయకులు పెద్ద పెద్ద మాటలు చెబుతారు. ఎందుకంటే వాళ్లు మాటలే చెబుతారు. మాటలు కోటలు దాటించి, కాళ్లు తంగెళ్లు కూడా దాటించలేరు. అందుకే గడపలోనే వుంటూ గూడుఫుఠానీ చేస్తుంటారు. మాయామశ్చీంద్ర వేషాలు వేస్తుంటారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఎంతకైనా దిగజారుతారు. ఒక్క విషయంలో కాంగ్రెస్‌ నాయకుల దుర్నీతి ఎలాంటిదో సూటిగా చెప్పొచ్చు. కాళేశ్వరం విషయంలో వాళ్లు చెప్పే మాటలు విని ప్రజలే చీ అంటున్నారు. తుమ్మిడి హట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణం చేస్తే సక్కగ నీళ్లన్నీ తెలంగాణ పారేవిఅంటూ అతి తెలివి లెక్కలు చెబుతున్నారు. సరే పదేళ్లు అధికారంలో వుండి ఎందుకు పూర్తి చేయలేదు. కేవలం ఎన్నికల కోసం, జిమ్మిక్కుల కోసం, తెలంగాణ ఉద్యమాన్ని చల్లార్చడం కోసం, ఉత్తర దక్షిణ తెలంగాణ మధ్య చిచ్చుపెట్టడం కోసంకాంగ్రెస్‌ ఆడిన నాటకమని ఎంత మందికి తెలుసు. కాంగ్రెస్‌ దుష్టపన్నాగాలు,కటిల రాజకీయాలు ఇలా వుంటాయి. నిజంగా తెలంగాణకు నీళ్లివ్వాలనే చిత్త శుద్ది కాంగ్రెస్‌కు ఏనాడు లేదు. వుంటే ఏనాడో తెలంగాణ పచ్చబడేది. కాని కాంగ్రెస్‌ పాలనలో ఎండిపోయింది. ఎడారిగా మారింది. సాగులేని కరువుకు కారణమైంది. మంచినీళ్లు కూడా దొరకుండా చేశారు. ప్లోరైడ్‌తో తెలంగాణ ప్రాంతమంతా కాళ్ల నొప్పులు,కీళ్ల నొప్పులు, నడుములు వంగిపోతుంటే చూశారే గాని మంచినీళ్లు కూడా ఇవ్వలేని కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు ఊసరవెళ్లి వేశాలు వేస్తున్నారు. మళ్లీ తెలంగాణను ఎండబెట్టడానికి కొత్త మొసలికన్నీరు కారుస్తున్నారు. ఇలాంటి స్వార్ధ నాయకులు నిండి వున్న కాంగ్రెస్‌ను నమ్మితే మళ్లీ నట్టెట మునుడుగే అంటున్న కొత్తగూడెం,ఇల్లందు బిఆర్‌ఎస్‌ ఇంచార్జ్‌,రాజ్యసభ సభ్యుడు ‘‘వద్దిరాజు రవిచంద్ర’’ నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్ర రావుతొ పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే…

పగటి వేషగాళ్ల రూపంలో కాంగ్రెస్‌ నాయకులు రంగులు మార్చి మళ్లీ వస్తున్నారు.
ఎన్నికల సమయం తప్పితే ఎప్పుడూ కనిపించరు. ఎన్నికలనగానే కలుగులో దాని వున్న ఎలుకలు బైటకొచ్చినట్లు వస్తారు. వచ్చి అబద్దాలను రంగులు పులుముతారు. ఈసారి మరీ భరితెగిస్తున్నారు. అలవి కాని హామీలను ముందు పెట్టుకొని నమ్మించి ముంచేందుకు వస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా వుండాల్సిన అసవరం వుంది. వ్యవసాయమే దండగ అన్నంతగా ఒక దశలో మాట్లాడిన వాళ్లు కూడా సాగు గురించి, వ్యవసాయం గురించి, నీళ్ల గురించి సిగ్గూ, ఎగ్గూ లేకుండా మాట్లాడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో యాభై ఏళ్లపాటు పాలించి తెలంగాణను అరిగోస పెట్టి, ఇప్పుడు తియ్యని మాటలు చెబితే ప్రజలు నమ్ముతారా? ఆదరిస్తారా? మొన్ననే పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎకరానికి మూడు గంటల కరంటు చాలు అంటూ వెకిలి మాటలు రైతుల చేత చీవాట్లు తిన్నాడు. అసలు తెలంగాణ వ్యవసాయం గురించి ఒక్కముక్క కూడా తెలియని వాళ్లు కాంగ్రెస్‌లో రాజకీయాలు చేస్తున్నారు. ఇదే మన దౌర్భాగ్యం. తెలంగాణలో ఎన్ని రకాల భూములున్నాయి. ఏఏ భూముల్లో ఎలాంటి పంటలు పండుతాయి? ఎంత నీరు అవసరం. ఏ భూమి ఎంత నీటిని తీసుకుంటుంది. అన్నదానిపై కనీసం అవగాహన లేని కాంగ్రెస్‌ నాయకులు మేం పాలిస్తాం. మాకు అవకాశం ఇవ్వండి అంటున్నారు. నిండా ముంచేందుకు రెడీగా వుండండి అన్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో ఒక దశలో కరంటు కష్టాలు ఎలా ఎదుర్కొన్నదో ప్రజలందరికీ తెలుసు. పల్లెలనుంచి మొదలుపట్టణాల దాకా ఏ రోజు కూడా పట్టుమని గంట సేపు కరంటు వున్న దాఖలాలు లేవు. ఇక పల్లెల కష్టం చెప్పనలవి కాదు. పగలు పదినిమిషాలు, రాత్రి పదినిమిషాలు అన్నట్లు ఎప్పుడు వచ్చేదో..ఎప్పుడు పోయేదే తెలియనంత చీకటికాలం చూశాం. కాంగ్రెను నమ్మితే మళ్లీ ఆ రోజులు రావడం ఖాయం. యాభై ఏళ్లు పాలించినా కరంటు ఎంత కావాలి? ఎలా తేవాలి? ఎలా సరఫరా చేయాలి? అన్నదానిపై కనీస అవగాహన లేకుండానే పాలించారు. ఇంకా తెలంగాణ వస్తే చిమ్మ చీకట్లే అంటూ లెక్కలు చెప్పారు. ఏమైంది? ఆంద్ర వెలుగులతో నిండిపోతుంది. తెలంగాణ చీకట్లలో మగ్గిపోతుందని కాంగ్రెస్‌నాయకులు చెప్పిన మాటలు తారుమారయ్యాయి. ఆంద్రలో కరంటు కష్టాలు. తెలంగాణలో కరంటు వెలుగులు చూస్తున్నాం. పొరపాటును కాంగ్రెస్‌ను నమ్మితే మళ్లీ తెలంగాణలో కరంటు కష్టాలు కొనుక్కున్నట్లే. ఇక దశలో వ్యవసాయానికి, పరిశ్రమలకు కూడా పవర్‌ హాలిడే ప్రకటించిన రోజులున్నాయి. కాంగ్రెస్‌ను పాపం అంటే చాలు మళ్లీ ఆ రోజులు వస్తాయి. అందుకే తెలంగాణ ప్రజలు, యువత పాత రోజులు ఎలా వుండేవో కూడా తెలుసుకోవాలి.
ఇదిలా వుంటే కాంగ్రెస్‌ను నమ్మితే పాలన గాలికి వదిలేసి, నిత్యం కొట్టుకుంటూ, ప్రజా సమస్యలను వదిలేస్తారు.
వారి వారి రాజకీయ ఆధిపత్యాలను ప్రజల మీద రుద్దుతారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో ఎక్కడా అమలు కాని పధకాలు ఒక్క తెలంగాణలోనే అమలు చేస్తామంటే ప్రజలు అంత అమాయకులు కాదు. అసలు కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికీ సీమాంధ్ర నేతల పెత్తనం కిందనే సాగుతోంది. ముఖ్యంగా రేవంత్‌రెడ్డి తన గురువు చెప్పినట్లు నడుకుంటాడే గాని, తెలంగాణ ప్రజలకు అనుకూలంగా పనిచేయడు. తెలంగాణ ప్రజలు ఓ వైపు ఉద్యమం సాగిస్తుంటే గన్‌ పట్టుకొని తెలంగాణ వాదులను బెదిరించిన రేవంత్‌రెడ్డి లాంటి వారి నాయకత్వం తెలంగాణ ప్రజలకు శాపమౌతుంది. అసలు తెలంగాణలో కాంగ్రెస్‌కు ఎలాంటి స్దానం లేదు. కాకపోతే అబద్దాలను పదే పదే చెప్పి నమ్మిస్తే అమాయక ప్రజలు కొన్ని సార్లు నమ్మి మోసపోయే అవకాశం వుంది. మంచి తొందరగా ఎవరికీ ఎక్కడు. చెడు తొందరగా చెవిని చేరుతుంది. అందుకే తెలంగాణను దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుకుంటున్న తరుణంలో కాంగ్రెస్‌ చెప్పే అబద్దాలను ప్రజలు నమ్మొద్దు. మళ్లీ మోసపోవద్దు. ఎందుకంటే వ్యవసాయం మళ్లీ మొదటికి తెస్తారు. కరంటు కోతలు సృష్టిస్తారు. రైతులను ఆగం చేస్తారు. రైతు బంధులో కోత పెట్టకుండా వుండలేరు. ప్రతిపక్షంలోవున్నప్పుడే కరంటు అంత అవసరం లేదని చెప్పిన వాళ్లకు అధికారమిస్తే మోటర్లుకు మీటర్లు పెట్టకుండా వదలరు. అందుకే ప్రజలు తప్పకుండా అప్రమత్తంగా వుండాలి. తెలంగాణ మళ్లీ చీకటి రోజులను చూడకుండా చూసుకోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ లాంటి నాయకుడు ప్రపంచంలోనే దొరకడు. అంత గొప్ప నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ ప్రజలు గోసపడుతుంటే కన్నీరు పెట్టుకున్ననాయకుడు కేసిఆర్‌. తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో ఎప్పుడూ కన్నీటిని జారవిడవకుండా బతకాలని తీర్చిదిద్దిన నాయకుడు కేసిఆర్‌. అలాంటి కేసిఆర్‌ నాయకత్వంలో తెలంగాణ సుభిక్షంగా వుంది. సుసంపన్నంగా ముందుకు సాగుతోంది. స్వయం సమృద్దిని సాధించింది. దేశ జిడిపిని మంచి ముందుకు దూసుకెళ్తోంది. చెడగొట్టే కాంగ్రెస్‌, బిజేపిలు కాచుకొని కూర్చున్నాయి. వాటి ఉచ్చులో పడొద్దు. తెలంగాణను చేజేతులా ఆగం చేసుకోవద్దు. ఇదే ప్రజలకు మనవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *