హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్
జైపూర్, నేటి ధాత్రి
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాంగణంలో ఆదివారం రోజున హెచ్ఎంఎస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఎస్టిపిపిలోని ప్రైవేట్ కంపెనీ పవర్ మేక్ యాజమాన్యం కార్మికుల సౌకర్యాల కల్పనలో విఫలమైందని,47డిగ్రీల ఎండలో సైతం కార్మికులు పనిచేస్తున్న యాజమాన్యం పట్టించుకోవట్లేదని, పని స్థలాలలో రక్షణ చర్యలు తీసుకోవడం లేదని,అలిసిపోయి వచ్చే కార్మికుల కు రెస్ట్ రూమ్ లు లేవని, ఎండ తాపం నుండి రక్షణలో భాగంగా ORS ద్రావణాలు సరఫరా చేయట్లేదని,రెస్ట్ రూముల్లో కనీసం కూలర్ సౌకర్యం కూడా లేదని,కార్మికులకు చల్లటి నీరు కూడా అందుబాటులో లేదని,ఇవ్వన్నీ ఏవీ వుండవు కానీ తినే టైములో ఆంక్షలు పెట్టి అక్కడ తినవద్దు,ఇక్కడ తినవద్దు అంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కేవలం మేము యాజమాన్యం అనే డాబు,దర్పం ప్రదర్శన చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూనిర్వాసితుల భూములు లాక్కొని వాళ్లతో ఊడిగం చేయిస్తూ వారితో అమర్యాద గా ప్రవర్తిస్తున్నారని, కంపెనీ బస్సు లో కార్మికులని వద్దని, లక్షల జీతాలు తీసుకుంటున్న అధికారులకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నారని, ఇది అంత మా కష్టారిజిత సొమ్ము కదా అని,కష్టం మాది దర్పం వారిది అయిపోతుందని,ఇదేనా మాకిచ్చే స్థానం, మేమేమైనా బానిసలమా అని ప్రశ్నించారు.8ఏండ్లు అవుతున్న ఇంతవరకు ప్రమోషన్ ఇవ్వలేదని, ఆర్ఎల్ సి అధికారితో గతంలో చర్చలు జరిగినప్పుడు యాజమాన్యం, కార్మికులు పరస్పర అవగాహనా తో మాట్లాడుకొని సమస్యలను పరిష్కరించాలని కోరిన యాజమాన్యం మొండి వైఖరి తో కార్మికుల ను పిలువలేదని తెలిపారు. క్యాంటీన్లలో కార్మికులకు సబ్సిడీ లేదని,పవర్ మేక్ అధికారులు కాకుండ క్యాంటీన్ నిర్వహణకు టెండర్ పిలిచి సబ్సిడీ తో ఏర్పాటు చేయాలని,అలాగే వాహనాలు కూడా టెండర్ పద్ధతిలో పిలవాలని,కార్మికులతో చాకిరీ చేయిస్తూ అధిక పనిగంటలకు డబ్బులు ఇవ్వకుండా పీహెచ్ రోజు కూడా డబల్ మాస్టర్ ఇవ్వకుండా నియంతల్లాగా కార్మికుల హక్కులు హరించి వేసి కార్మికుల దుఃఖానికి కారణం అవుతున్నారని,సింగరేణి అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కార్మికుల కష్టాలు,బాధలు గమనించి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుంటే జరిగే పరిణామాలకు, బాధ్యత వహించాలిసి ఉంటుందని,ఇది ఇలాగే కొనసాగితే కడుపు మండిన కార్మికుల క్రోధాగ్ని కట్టలు తెంచుకుంటే ఆపడం ఎవ్వరికి తరం కాదని, పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయని హెచ్ఎంఎస్ తరపున హెచ్చరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టిపిపి హెచ్ఎంఎస్ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రదీప్ రెడ్డి, సెక్రటరీ సాయి కృష్ణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఎలుక రమేష్ ,చిప్పకుర్తి సంపత్ , గోగు మణికుమార్, రామగిరి మల్లేష్ ,నవీన్, కార్మికులు పాల్గొన్నారు.
