
ఒవైసీ ఫాతిమా కాలేజీపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ
పాత బస్తీలోని సూరం చెరువులో నిర్మించిన ఒవైసీ ఫాతిమా కాలేజీపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ కాలేజీ నడుస్తోందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. అందుకనే ఈ కాలేజీని కూల్చివేయడానికి ఆలోచిస్తున్నామని ఏపీ రంగానాథ్ స్పష్టత ఇచ్చారు.
పాతబస్తీలోని సూరం చెరువులోని ఎఫ్టీఎల్లో ఫాతిమా కాలేజీని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిర్మించారు. అయితే ఈ కాలేజీని ఎందుకు కూల్చడం లేదని ప్రతిపక్షాలు హైడ్రా అధికారులని ప్రశ్నిస్తున్నారు. సామాన్యులకు ఒక న్యాయం, ఒవైసీకి ఒక న్యాయమా అంటూ నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ఫాతిమా కాలేజీ గురించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగానాథ్ (AV Ranganath) స్పందించారు. ఈ కాలేజీని ఎందుకు కూల్చి వేయడం లేదనే దానిపై క్లారిటీ ఇచ్చారు ఏవీ రంగానాథ్.
ఒవైసీ కాలేజీని ఎందుకు కూల్చివేయడం లేదని ఇప్పుడు అందరూ తమని అడుగుతున్నారని ఏవీ రంగానాథ్ అన్నారు. ఈ కాలేజీ ఎఫ్టీఎల్లో నిర్మించినందున గత ఏడాది సెప్టెంబర్లో తొలగించే ప్రయత్నం చేస్తామని చెప్పామని గుర్తుచేశారు. కానీ పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ కాలేజీ నడుస్తోందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ కాలేజీలో 10,000 మందికి పైగా బాలికల నుంచి యువతుల వరకు విద్యను అభ్యసిస్తున్నారని గుర్తుచేశారు. పేద ముస్లిం మహిళలను వెనుక బాటుతనం నుంచి ఒవైసీ కాలేజీ విముక్తి కల్పిస్తోందని అన్నారు. పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కావడంతోనే దానిపై చర్యలు తీసుకోవడానికి ఆలోచిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు ఏవీ రంగానాథ్.
ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కబ్జా చేసిన భారీ నిర్మాణాలను కూల్చివేశామని ఏవీ రంగానాథ్ తేల్చిచెప్పారు. 25 ఎకరాల సరస్సును ఫ్లాట్గా మార్చిన ఒవైసీ కుటుంబానికి చెందిన సన్నిహితుడు కట్టడాలను కూడా కూల్చివేశామని గుర్తుచేశారు. మజ్లిస్ నాయకుల నుంచి దాదాపు రూ. 1,000 కోట్ల ఆస్తులను ఇప్పటికే రికవరీ చేసుకున్నామని వెల్లడించారు. చాంద్రాయణ గుట్టలో ఎంఐఎం కార్పొరేటర్ స్థలాన్ని స్వాధీనపరుచుకున్నామని తెలిపారు. సామాజిక కారణాలతోనే ఫాతిమా కాలేజీ కూల్చివేతను నిలిపివేశామని అన్నారు . సామాజిక స్పృహతో ఈ కాలేజీ నడుస్తోందని.. అందుకే కూల్చివేయడానికి కాస్త ఆలోచిస్తున్నామని ఏపీ రంగనాథ్ పేర్కొన్నారు