అడ్డంగా నిలువు దోపిడి…
బయట మార్కెట్లో కొన్న పుస్తకాలకు నో ఫర్మిషన్…
ప్రభుత్వ పాఠ్యాంశాలను మాత్రమే బోధించాలన్న నిబంధనలకు తూట్లు…
జిల్లా వ్యాప్తంగా ప్రయివేట్, కార్పొరేట్ యాజమాన్యం సిండికేట్…
పాఠశాలల్లోనే స్టేషనరీ బహిరంగంగానే అమ్మకాలు..
యూనిఫాం,బెల్ట్,బ్యాడ్జీలు, షూ అన్నీ వారి వద్దే…
ఒక్కో విద్యార్థి నుంచి రూ.15 వేలకు పైగా వసూలు…
పెద్ద తరగతి విద్యార్థి నుంచి రూ. 20 వేలకు పైగా వసూలు…
మెంటనేన్స్ షరా మామూలే…
అడ్డంగా నిలువు దోపిడీ నోరు మెదపని విద్యాశాఖ…
జిల్లాలో అధికారుల పర్యవేక్షణ కరువు..
నిర్దిష్టమైన ఫిర్యాదులు అందలేదని సాకులు చెబుతూ తప్పించుకుంటున్న అధికారులు…
జిల్లా వ్యాప్తంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి…
నేటి ధాత్రి –
గార్ల :-పాఠ్య పుస్తకాల నుంచి సాక్సుల వరకు విద్యార్థులకు ఏది అవసరమైనా మా దగ్గరే కొనాలి..! లేకుంటే అనుమతించేది లేదు..,అంటూ ప్రయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు హుకుం జారీ చేస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి అడ్డంగా దోచుకుంటున్నాయి. ప్రతీది వారి వద్దే కొనాలని షరతులు విధిస్తున్నారు. విద్యాశాఖ అధికారులకు తెలిసినప్పటికీ కనీస చర్యలు తీసుకోవడం లేదు. తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం పాఠశాలలను పరిశీలించిన దాఖలాలు కూడా లేవు. పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలకు గంపగుత్తగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు వసూలు చేస్తున్నారు. వారు నిర్ణయించిందే ధర. వర్క్ పుస్తకాలు..,నోటు పుస్తకాలు.., డ్రాయింగ్ బుక్స్..,అంటూ బహిరంగ మార్కెట్ కంటే రెండింతలు వసూలు చేస్తున్నారు. అయినా విద్యాశాఖ నోరు మెదపడం లేదు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.
జిల్లా వ్యాప్తంగా ప్రయివేట్, కార్పొరేట్ యాజమాన్యం సిండికేట్..,
జిల్లా వ్యాప్తంగా ప్రైయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యం సిండికేటై దోపిడికి తెగబడుతున్నాయి. పుస్తకాల నుంచి సాక్సుల వరకు విద్యార్థులకు ఏది అవసరమైన మా దగ్గరే కొనాలి…! అంటూ హుక్కుం జారీ చేస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులను బహిరంగంగానే పీల్చి పిప్పి చేస్తున్నాయి. వారు చెప్పిందే ధర. బయట మార్కెట్ లో కొన్న పుస్తకాలకు నో పర్మిషన్.., లేకుంటే క్లాస్ లో నుమతించేది లేదని తెగేసి చెప్తున్నాయి. ఇంత జరుగుతున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు కళ్లకు కనిపించడం లేదు. తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రైయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యం సిండికేటై పాఠశాలలో విక్రయిస్తున్న స్టేషనరీ ధరలు ఇలా ఉన్నాయి. యూని ఫాం (ఒకజత) రూ.1500 నుంచి రూ.3000, బెల్ట్ రూ.150 నుంచి 200, టై రూ.100, బ్యాగు రూ.600 నుంచి రూ. 800, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ రూ. 4000 నుంచి రూ.6000 వరకు విక్రయినున్నారు. ఇవి చాలదన్నట్లు వర్క్ బుక్ ల పేరుతో రూ.2000 నుంచి రూ.5000 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతీది ఇక్కడే కొనాలన్న నిబంధనలు విధిస్తున్నారు. విద్యాశాఖ అధికారులకు తెలిసినప్పటికి కనీస చర్యలు తీసుకోకుండా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రభుత్వ పాఠ్యాంశాలను మాత్రమే బోధించాలి. దీనికి సంబంధించి వారి విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రభుత్వ మండల విద్యాధికారి అనుమతి ద్వారా పాఠ్యపుస్తకాలు తెప్పించుకోవాలి. ఆ రేట్లకే అవసరాన్ని బట్టి తల్లిదండ్రులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ పాఠ్యపుస్తకాలకు, నోటు పుస్తకాలకు గంపగుత్తగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి నగదు వసూలు చేస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పాఠశాలల యాజమాన్యాలు వేలాది రూపాయల ఫీజుల భారం మోపుతున్నాయి. అడ్మిషన్ ఫీజు, బిల్డింగ్ ఫీజు, కంప్యూటర్ ల్యాబ్, ట్యూషన్, స్పోర్ట్, స్పెషల్ డేస్, కమ్యూ నికేషన్ ప్రోగ్రాం ఫీజులంటూ ఇప్పటికే వేలాది రూపాయలు వసూలు చేస్తున్న యాజమన్యాలు మళ్లీ పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం, షూ అంటూ అందిన కాడికి అందినంత దోచుకుంటున్నాయి.
కనిపించని మౌళిక వసతులు….!

జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు నడుస్తున్నాయి. పూర్తిస్థాయి మౌలిక వసతులున్న పాఠశాలలను వేళ్లమీదే లెక్కపెట్ట వచ్చు. పలు పాఠశాలల్లో మౌలిక వసతులు లేవు. విద్యార్థులకు సరిపడా ఆటస్థలాల కొరత, తరగతి గదుల కొరత ఉంది. అయినప్పటికీ, అధికారులు మాత్రం ఆ వైపు కన్నెత్తి చూసిన పాపాన పోవటం లేదన్న విమర్శలు వినపడుతున్నాయి. ఇలా అరకొర వసతులతో పాఠశాలలు నిర్వహిస్తున్నా ఫీజుల వసూళ్లలో మాత్రం పోటీపడి మరీ వసూలు చేస్తున్నాయి. ఇది చాలదన్నట్లు పుస్తకాల దోపిడీ అదనంగా ఉంటోంది. పెద్ద తరగతులకు నోటు పుస్తకాల ఖర్చు కాస్త ఎక్కువగా ఉంటుందనుకున్నా..,గరిష్టంగా రూ.1500 మించి ఉండదు. అన్ని కలిపి పదో తరగతికి కూడా రూ.2 వేలు పుస్తకాల ఖర్చు సరిపోతుంది. అయితే ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా పుస్తకాల ధరల వసూలు చేస్తుండగా, పెద్ద తరగతులకు రూ.8 వేలు నుంచి రూ.10 వేలవరకు వసూలు చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. తమ పిల్లల్ని ఎక్కడ వేధిస్తారోననే భయంతో తల్లిదండ్రులు ప్రశ్నించడం మానేశారు. ఇది ఆసరాగా చేసుకున్న ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల నిర్వహకులు దోపిడీని పెంచారు.
విద్యాశాఖ అధికారుల తనిఖీలు నిల్…!
వాస్తవానికి ప్రభుత్వ విద్యాశాఖ నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల అమ్మకాలు నిషేధం. విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేసి పుస్తకాల అమ్మకాలను అడ్డుకోవాల్సి ఉంది. ఆయా పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. అయితే విద్యాసంస్థల నిర్వా హకులు బహిరంగానే పుస్తకాల ధరలను ప్రకటిస్తున్నాయి. ఏ తరగతికి ఎంత చెల్లించాలి? నోట్ పుస్తకాలకు ఎంతా?, బెల్టుషూ వంటిది ఎంతా?.. ధరలు నిర్ణయించి వసూలు చేస్తు న్నాయి. ప్రతి వస్తువు కొనుగోలుకు రసీదు ఇవ్వాలన్న నిబంధన తూట్లు పొడిచి తెల్లకాగితంపై రేట్లు వేసి దోచుకుంటున్నారు. బహిరంగ మార్కెట్ తో పోల్చితే ఈ ధరలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. నిర్దిష్ట గడువు నిర్ణయించి పుస్తకాలు కొనుగోలు చేయాలని లేకుంటే క్లాస్ లోకి అనుమతించేది లేదని చెబుతున్నాయి. ఇవేమీ అధికారులకు కనిపించడం లేదు. నిర్దిష్టమైన ఫిర్యాదులు అందలేదని సాకులు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ప్రైవేటు పాఠశాల దోపిడీ యధేచ్ఛగా సాగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారో లేదో వేచిచూడాల్సిందే.