ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలను అందించాలి
హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ జిల్లా, నేటిధాత్రి (మెడికల్):
హనుమకొండ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్య సేవల నిమిత్తం వచ్చే రోగులకు మెరుగైన సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు.
శుక్రవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని ఇన్ పేషంట్ వార్డును సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ మాట్లాడారు. మెడికల్ ఆఫీసర్ కార్యాలయాన్ని సందర్శించి ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు సిబ్బంది హాజరు పట్టికను, స్టాక్ రిజిస్టర్, మెయింటెనెన్స్ రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న కొందరు సమావేశానికి హనుమకొండకు వెళ్ళగా కలెక్టర్ ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎన్ని ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ రావును అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన ఓఆర్ఎస్ ప్యాకెట్ల డబ్బాలను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఓఆర్ఎస్ ప్యాకెట్లను సబ్ సెంటర్ల ద్వారా పంపిణీ చేయాలన్నారు. ఆరోగ్య సేవల కోసం ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండి సేవలను అందించాలన్నారు.
ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ విక్రమ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.