Gundala Players Selected for Khelo India Tribal Meet
ఖేలో ఇండియా కు గుండాల క్రీడాకారులు ఎంపిక
గుండాల,నేటిధాత్రి :
ఈనెల 23న రాజస్థాన్ లో జరగనున్న ఖేలో ఇండియా ట్రైబల్ మీట్ ఫుట్ బాల్ క్రీడలకు గుండాల మండలంకు చెందిన నలుగురు యువకులు ఎంపికయ్యారు. ఈనెల 7,8 తేదీలలో కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన ఫుట్ బాల్ క్రీడలో కొమ్ముగూడెం గ్రామానికి చెందిన వాగబోయిన వంశీ, సాయినపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు తాటి మోహన్, పోలేబోయిన హర్షిత్, చింతలపాడు గ్రామానికి చెందిన ఊకె శ్రావణ్ కుమార్ లు ప్రతిభ కనపర్చి తెలంగాణ రాష్ట్రం తరఫున ఆడనున్నారు. ఈ నెల 23 నుండి 27 తేదీ వరకు ఐదు రోజులపాటు జరగనున్న క్రీడలలో తెలంగాణ జట్టు తరపున ఆడనున్నారు. తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ ఈ నాలుగు జట్ల మధ్య జరగనున్న ఫుట్ బాల్ పోటీల్లో గెలుపొంది తెలంగాణ కే కాకుండా మారుమూల మన గుండాల మండలం పేరు ప్రఖ్యాతలు నిలబెడతామని ఈ నలుగురు క్రీడాకారులు ఆశా భావం వ్యక్తం చేశారు.
