సబ్ స్టేషన్ల నిర్మాణ పనుల శంకుస్థాపన
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
భూపాలపల్లి నేటిధాత్రి:

ప్రజా ప్రభుత్వంలో సంక్షేమాన్ని వెనకబడనివ్వం.. అభివృద్ధిని ఆగనివ్వమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డీసీసీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా కొత్తపల్లిగోరి మండలం చెన్నాపూర్ గ్రామంలో నూతనంగా రూ. 140 లక్షలతో నిర్మించిన సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. అనంతరం మొరంచపల్లి నుండి మంజూరునగర్ వరకు వరకు సాగిన పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించగా, ఈ ర్యాలీలో అతిథులు ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం మంజూరునగర్లో నవాబుపేట, ధర్మారావుపేట, మంజూరునగర్ గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ… ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలపై ఒక్క రూపాయి భారం మోపకుండా వేల కోట్లతో సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి మేలు చేయాలన్న తలంపుతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం క్యాబినెట్ నిరంతరం కృషి చేస్తుందన్నారు.ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని అన్నారు. రూ.22,500 కోట్లు ఖర్చు చేసి 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించబోతున్నామని తెలిపారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి, కనీసం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. మేం అధికారంలోకి రాగానే సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి గ్రూప్ వన్ పరీక్షను విజయవంతంగా నిర్వహించామున్నారు.

ఏడాదిన్నర కాలంలో 57వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసాం, మరో 30 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయబోతున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు యువతను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు తొమ్మిది వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకాన్ని తీసుకువచ్చామన్నారు. 5 లక్షల మంది నిరుద్యోగులు వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రోత్సహించేందుకు తొమ్మిది వేల కోట్ల నిధులు ఖర్చు చేయనున్నామన్నారు. ప్రజా ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీని మొదటి ఏడాదిలోనే చేసిందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ కోసం రూ. 21,500 కోట్లు ఖర్చు చేసామన్నారు. రూ.13 వేల కోట్లు ఖర్చు చేసి 90 లక్షల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రతి నెల 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో సగభాగంగా ఉన్న మహిళలు రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, గుడికి, లేదా పిల్లల బడికి వెళ్లేందుకు ప్రతి మహిళ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం కల్పించిందన్నారు. పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలల్లో గుమ్మడి శ్రీదేవి అప్పం కిషన్ విస్లావత్ దేవన్ పిప్పాల రాజేందర్ సుంకర రామచంద్రయ్య పెద్ద సంఖ్యలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.