# నేడు యాజమాన్యాలకు సమ్మె నోటీసులు,15 న బైక్ ర్యాలీలు.
నర్సంపేట,నేటిధాత్రి :
ఈనెల 16న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్ ను జయప్రదం చేయాలని ఆల్ ట్రేడ్ యూనియన్ సమావేశంలో ఏఐటిసి జిల్లా కార్యదర్శి గుంపెల్లి మునీశ్వర అధ్యక్షతన సిపిఎం కార్యాలయంలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఏఐఎఫ్టియు (న్యూ) రాష్ట్ర అధ్యక్షుడు మోడం మల్లేశం, బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అనంతగిరి రవి లు మాట్లాడారు.ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్ శక్తులకు కారు చౌకగా అమ్ముతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె జయప్రదానికి నేడు అన్ని యజమాన్యాలకు సమ్మె నోటీసులు ఇవ్వాలని 15వ తారీఖున బైక్ ర్యాలీ నిర్వహించాలని సమావేశం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హమాలి యూనియన్ రాష్ట్ర కార్యదర్శి (బిఆర్టియు అనుబంధం) కొల్లూరు లక్ష్మీనారాయణ, సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు హనుమకొండ శ్రీధర్, కందికొండ రాజు, భవనిర్మాణ సంఘం అధ్యక్షుడు రుద్రారాపు పైడయ్య, ఏఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి ఎల్లన్న, ఏఐఎఫ్టియు అమాలి నాయకులు నాగులు తదితరులు పాల్గొన్నారు.