ధాన్యాన్ని వేగవంతంగా మిల్లులకు తరలించాలి.
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.
నర్సంపేట మార్కెట్ యార్డ్ను సందర్శన.
నర్సంపేట నేటిధాత్రి:
రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద నుండి వేగవంతంగా మిల్లులకు తరలించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో గల పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పరిశీలించారు.ఇటీవల అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో, మార్కెట్లో అధికారులు, రైతులు తీసుకుంటున్న జాగ్రత్తలను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాల ప్రభావం నుంచి ధాన్యాన్ని రక్షించేందుకు రైతులు టార్పాలిన్ కప్పి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.వర్షం వలన తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి, పాడి క్లీనర్ ద్వారా శుభ్రపరచి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కొనుగోలు కేంద్రాల నిర్వహణ, సిబ్బంది పనితీరు, ధాన్యం నాణ్యత, రైతుల అవసరాలు, డబ్బు చెల్లింపులు తదితర అంశాలను పరిశీలించారు.
ధాన్యాన్ని వేగవంతంగా మిల్లులకు తరలించాలని అధికారుల కలెక్టర్ ఆదేశించారు. కేంద్రాలలో ప్యాడి క్లీనర్ లు, గన్ని బ్యాగులు, తాగునీరును అందుబాటులో ఉంచాలని సూచించారు.రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు. ధాన్యం రవాణాకు సరిపడా వాహనాలను, ధాన్యం ఎగుమతులు, దిగుమతులు వెంటనే జరిగేలా అవసరమైన హమాలీలను సమకూర్చుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన రెండు రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యేవిధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి నీరజ,జిల్లా పౌర సరఫరాల అధికారి కిష్టయ్య,జిల్లా మేనేజర్ సంధ్యారాణి,ఆర్డీఓ ఉమారాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ,మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్,కార్యదర్శి జి.రెడ్డి, తహసీల్దార్ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.