ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం కృషి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని ఐ. బి. చౌరస్తా నుండి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల,జిల్లా క్రీడాధికార సంస్థ మైదానం వరకు చేపట్టిన తెలంగాణ మారథాన్-ఫిజికల్ లీటరసి కార్యక్రమంలో డి సి పి భాస్కర్,గుడిపేట 13వ పటాలము కమాండెంట్ వెంకటేశ్వర్లు,జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి హనుమంత రెడ్డి,జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్, ఎ. సి. పి. ప్రకాష్, యువతీ యువకులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన దేశం యువ భారతదేశం అని,దేశంలో యువ జనాభా అధికంగా ఉందని తెలిపారు.రాష్ట్ర,దేశ అభివృద్ధిలో యువత అత్యంత కీలకమని,దేశ అభివృద్ధి కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనాలని తెలిపారు.ఆరోగ్యం,క్రమశిక్షణ కలిగి ఉండాలని,వ్యాయామం, యోగ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని తెలిపారు. మాదక ద్రవ్యాలు,మద్యం వల్ల కలిగే అనర్ధాలను తెలుసుకొని యువత వాటికి దూరంగా ఉండాలని,మాదకద్రవ్య రహిత తెలంగాణగా సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు.”నో టు డ్రగ్స్ – ఎస్ టు ఎక్సర్సైజ్” నినాదం దిశగా ప్రతి ఒక్కరు ఆరోగ్యం వైపు అడుగులు వేయాలని,ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని తెలిపారు.ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా శారీరక రుగ్మత, మానసిక ఆందోళనల నుంచి బయటపడవచ్చు అని, అనారోగ్యం దరిచేరకుండా కాపాడుకోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు,యువతి యువకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
