దర్జాగా “ప్రభుత్వ భూమి కబ్జా”…?
రెవెన్యూ అధికారులు “బోర్డు”లు పాతిన ఫలితం శూన్యం..?
ఐ….య్యామ్ డోంట్ కేర్ అంటున్న కబ్జాదారుడు
అన్ని సక్రమమే అయితే, అధికారులు ప్రభుత్వ భూమి అని బోర్డు ఎందుకు పాతిండ్లు?
“ఐలయ్య”… ఇదేందయ్యా “బోర్డు” అంటున్న ప్రజలు?
దేశాయిపేట శివారు, జర్నలిస్ట్ కాలనీ డబల్ బెడ్ రూమ్ ల పక్కన గల సర్వే నంబర్ 81లో గల ప్రభుత్వ భూమిని, “ఓ అయ్య” కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి..
తప్పుడు భూరికార్డులతో యథేచ్ఛగా దేవాదాయ శాఖ భూమి “అక్రమ రిజిస్ట్రేషన్”.
“అయ్య”కు అండగా దేవాదాయ శాఖ భూములను రిజిస్ట్రేషన్ చేసిన అప్పటి ఓ “సబ్ రిజిస్ట్రార్”?
“ఆక్రమించిన” ప్రభుత్వ భూమిలో, “అక్రమంగా అమ్మకాలు” జరిపిన ఘనుడు.?
కబ్జా చేసిన ప్రభుత్వ భూముల్లో, కొనుగోలు చేసి “అక్రమ నిర్మాణం చేపట్టిన ఓ వైద్యురాలు?”
“మున్సిపల్ పర్మిషన్” లేకుండానే నిర్మాణం చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం..
దేవాదాయ భూముల్లో “బొక్క” లు ఏరుకుంటున్న ఓ మధ్యవర్తి?
అక్రమంగా వెలుస్తున్న బహుళ అంతస్తుల భవనాలు
ఈ తతంగం వెనక లక్షల రూపాయలు చేతులు మారినట్లు వినికిడి..?
నేటిధాత్రి, వరంగల్ తూర్పు
పేదోళ్లు గూడు కోసం, అసైన్డ్ భూముల్లో గుడిసెలు వేస్తే అధికారులు నానా హంగామా చేసి వాటిని తొలగించి కేసులు పెట్టి జైలుకు పంపుతారు. అలాంటిది రూ.5 కోట్లకు పైగా విలువ చేసే రెండు ఎకరాల దేవాదాయ శాఖ ప్రభుత్వ భూమిని ఒకరు కబ్జా చేసి, అమ్మకాలు జరిపి, యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు మొదలు పెట్టడం చూస్తే, మున్సిపల్ శాఖ అధికారులు ఇటు వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు అని ఆరోపణ.

వివరాల్లోకి వెళితే దేశాయిపేట శివారు, లక్ష్మి మెగా టౌన్షిప్ ఆనుకొని, నూతనంగా ఏర్పాటు అయిన జర్నలిస్ట్ కాలనీ డబల్ బెడ్ రూమ్ ల పక్కన గల ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 81లోని రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తి కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి ముందు వైపు ఒక వ్యక్తి మాత్రమే లోపలికి వెళ్ళేంతా ఎంట్రెన్స్ పెట్టిన తీరు చూస్తే ఆశ్చర్యానికి గురిగాక తప్పదు.

కబ్జా విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఆ స్థలం ప్రభుత్వ భూమి అని గుర్తించి, అందులో బోర్డు పాతి, ఆక్రమించిన వారిపై క్రిమినల్ చర్యలకు పిర్యాదు చేసినట్లు సమాచారం. ఇదే విషయంపై అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులు బోర్డు పాతిన స్థలం ఎక్కడ అని అక్కడే ఉన్న ఓ వ్యక్తిని అడిగితే ఇందులో కాదు, వేరే దగ్గర అంటూ చెప్పిన తీరు, తీరా కనుక్కుంటే ఆ వ్యక్తి సైతం “అయ్య”కు అనుచరుడు అని తెలిసింది.

కబ్జా విషయం బయటకు రాకుండా, జాగ్రత్త పడుతున్న కబ్జాదారుడు అతని అనుచరులు.. బోర్డును పాతిన ప్రభుత్వ భూమిని, ఓ “పెద్దయ్య” 2017లో తప్పుడు పత్రాలతో అప్పటి ఓ “సబ్ రిజిస్ట్రార్” అండతో సర్వే నంబర్ 81లో గల రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సమాచారం, అందులో కొంత అమ్మకాలు జరిపి యదేచ్చగా నిర్మాణాలు సైతం చేపట్టడం చేస్తున్నారు. ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది అని రెవెన్యూ అధికారులకు సమాచారం రాగానే, విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు ఆ భూమి ప్రభుత్వ భూమి అని బోర్డు పాతి, ఆక్రమించిన వారికి చర్యలు తప్పవు అని బోర్డు పాతి వెళ్ళారు.

అయినా కానీ అందులో నిర్మాణం ఆపకుండానే పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా మున్సిపల్ పర్మిషన్ లేకుండా నిర్మాణం చేపడుతుంటే మున్సిపల్ అధికారులు చోద్యం చూడటం వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన ఘనుడు ఎవరు? ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేయడంలో ఆ అధికారి దిట్ట అనే చెప్పొచ్చు. అప్పట్లో పహాని కాపీలతో సైతం రిజిస్ట్రేషన్ చేసి, చేసి, ఆ సబ్ రిజిస్ట్రార్ పేరు మారుమోగింది. అయితే ఇక్కడ ప్రభుత్వ భూమి కబ్జా చేసిన వ్యక్తి, ఓ రాజకీయ నాయకుడు పేరు చెప్పడం, సదరు నాయకుడికి సైతం ఈ విషయం తెలువకపోవడం గమనార్హం. ఇదేంది “అయ్య” అని అన్నట్లు సమాచారం. రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.. “అయ్య”గారీ ఆక్రమణలు అనేకం ఉన్నట్లు తెలుస్తోంది?. సదరు అయ్య కబ్జాలపై ప్రత్యేక విచారణ చేయాల్సిందిగా టాస్క్ఫోర్స్ పోలీసులకు నగర ప్రజల విజ్ఞప్తి.

తప్పుడు రికార్డులతో కబ్జా?
మునిసిపాలిటీలు, మండల కేంద్రాల పరిధిలో ఉన్న భూముల ధరల రేట్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం వీటి విలువ వందల కోట్ల రూపాయాల్లో ఉంటుంది. పట్టణాలు, గ్రామాల విస్తరణతో ఈ భూములపై అక్రమార్కులు కన్నేస్తున్నారు. కొన్ని భూముల్లో ఇళ్ల నిర్మాణాలు కూడా జరిగాయి. మరికొన్ని చోట్ల దాతల పేరుతో ఉండడంతో వారు అమ్మినట్లు భూముల రికార్డులను సృష్టించి ఆ భూములను దొడ్దిదారిని ఆక్రమించుకుంటున్నారు. భూములు ధరలు గణనీయంగా పెరగడంతో కొన్ని చోట్ల దానంగా ఇచ్చిన భూముల అసలు వారసులు రంగ ప్రవేశం చేసి ఆవి మావేనని కోర్టుల్లో కేసులు వేశారు. అవి ప్రస్తుతం దేవాదాయ శాఖ ట్రిబ్యునల్, కోర్టుల్లో ఆ కేసులు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయి.
ఇదేందయ్యా “మసి”…?
రెండు ఎకరాలు దర్జాగా కబ్జా.. దేవాదాయ శాఖ భూములపై “మసి” మరక?
కాసులు ఇస్తే కాదేది రిజిస్ట్రేషన్.. పహాని కాపీలతో సైతం రిజిస్ట్రేషన్ చేసిన ఘనుడు ఆ “సబ్ రిజిస్టర్”..
ఒక్కో ఫ్లాట్ “ఇద్దరికీ” సైతం రిజిస్ట్రేషన్ చేసిన చరిత్ర కలిగిన “సబ్ రిజిస్ట్రార్”..?
ఏదైనా భూమి కానీయి, రిజిస్ట్రేషన్ చేయడం ఆయనకు “వెన్నతో పెట్టిన విద్య” ఆ సబ్ రిజిస్టర్ కే సొంతం..?
ఎవరా “సబ్ రిజిస్ట్రార్”? ఎవరా “అయ్యా”?
పూర్తి వివరాలు “నేటిధాత్రి ప్రత్యేక కథనం” త్వరలో..