అభివృద్ధి సంక్షేమంలో దేశానికే ఆదర్శం మన ప్రజా ప్రభుత్వం
రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పోరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య
భూపాలపల్లి నేటిధాత్రి
అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శం మన ప్రజా ప్రభుత్వం నిలుస్తుందని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకోవాలని రాష్ట్ర అవతరణ దినోత్సవ ముఖ్య అతిథి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పోరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలతో కలిసి ముఖ్య అతిథి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పోరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య పాల్గొన్నారు.
ముందుగా జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చం పెట్టి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం భూపాలపల్లి కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ముఖ్య అతిథి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై ముఖ్య అతిథి మాట్లాడుతూ..
శుభకార్యం తలపెట్టేటప్పుడు దేవుడిని తెలంగాణ అమరుల త్యాగాలను స్మరించుకోవడం మన ధర్మం అన్నారు.
అది వారి త్యాగానికి మనం ఇచ్చే గొప్ప గౌరవమన్నారు.
జై తెలంగాణ.. ఇది నినాదం కాదు..
యావత్తు తెలంగాణ ప్రజల శ్వాస అంతేకాదు..
అస్తిత్వం, ఆరాటం, పోరాటం, ఆత్మగౌరవం, చైతన్యం, భావోద్వేగం అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అసువులు బాసిన త్యాగధనులకు వేల వేల వందనాలు..
అరవై ఏండ్ల తెలంగాణ అస్తిత్వ ఉద్యమాల్లో వారి పోరాటం, అమరం, అజరామరం..
వారి త్యాగం, వారి త్యాగ స్ఫూర్తి నిరూపమానం అన్నారు.
జీవితాన్ని త్యాగం చేయడమంటే మాటలు కాదు.
అయినా ఏండ్ల తెలంగాణ కలను నిజం చేయడం కోసం వారు తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించారు.
నావల్లనైనా తెలంగాణ రాష్ట్రం రావాలి అని విద్యార్థి శ్రీకాంతాచారి, పోలీసు కానిస్టేబుల్ కిష్టయ్య, సిరిపురం యాదయ్య, వేణుగోపాల్, యాదిరెడ్డిలాంటి వందలమంది ప్రాణాలర్పించారన్నారు.
తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు చేసుకుంది కేవలం 459 మందే అని గత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
కానీ, ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉద్యమంలో 1200 మందికి పైగా ఉద్యమకారులు ప్రాణాలర్పించారన్నారు.
బిడ్డలను కోల్పోయిన ఆ కుటుంబాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందన్నారు.
తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో వారి ఆశయ సాధనకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని, వారు కలలు కన్న తెలంగాణ పునర్నిర్మాణానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు.
వందలాది అమరుల త్యాగఫలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం.
వారి స్ఫూర్తి నిత్యం మదిలో మెదిలేలా అమరవీరుల త్యాగం భవిష్యత్ తరాలకు తెలిపేలా మనందరం సమిష్టి గా కృషి చేయాలన్నారు.
అనంతరం రాష్ట్ర సాధన కోసం అసలు బాసిన అమరుల కుటుంబ సభ్యులను అతిథిచే శాలువాలు కప్పించి సత్కరించారు.
రైతులకు మేలు రకం వరి విత్తనాలను పంపిణీ చేశారు.
ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను, అక్కడున్న వారిని ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.
భూపాలపల్లి లోని కేజీబీవీ, బాలాజీ ఇంటిగ్రేటెడ్ స్కూల్, సెయింట్ పీటర్స్ హై స్కూల్, సన్ వ్యాలీ హై స్కూల్ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ సంస్కృతిక సారథి కళాకారులు ఆలపించిన తెలంగాణ ఉద్యమ గీతాలు సైతం ఆహుతులను ఆకట్టుకున్నాయి.
అనంతరం అతిధుల చేతుల మీదుగా చిన్నారులకు జ్ఞాపికలను అందజేసి అభినందించారు.
అనంతరం కలెక్టరేట్ ఐడీవోసీ లో ఏర్పాటు చేసిన హై టీ కార్యక్రమంలో పాల్గొన్నారు.