కార్మికులందరికీ మేడే దినోత్సవ శుభాకాంక్షలు
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి
శాయంపేట నేటి ధాత్రి:
రాష్ట్రంలో అన్ని వర్గాల కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు.మండల కేంద్రంలో ఐఎన్టీయూసీ మండల అధ్యక్షుడు మారపెల్లి రాజేందర్ ఆధ్వర్యంలో బుధవారం మేడే దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బుచ్చిరెడ్డి మాట్లాడుతూ శ్రమదోపిడీని ఎదురించి శ్రమ శక్తి గెలుపొందిన గొప్పదినం మేడే అని అభివర్ణించారు. కార్మికుల చెమట చుక్క ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న ఫలాలని, సంపద సృష్టికర్తలు కార్మికులే అని అభి ప్రాయపడ్డారు. కార్మికులు లేని ప్రపంచాన్ని ఊహించలేమని అన్నారు. తమ కష్టంతో ప్రగతి పూర్వక సమాజ నిర్మాణానికి చేయూతనిచ్చే శ్రామికుల హక్కులను కాపాడడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో కార్మికులు వివక్షతకు గురయ్యారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులను కాపాడుకుని, వారి సంక్షేమానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం కార్మికులందరికీ మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు చిందం రవి, మారేపల్లి రవీందర్, రఫీ, రాజు, ప్రపంచ రెడ్డి, శంకర్, పైడి తదితరులు పాల్గొన్నారు.