# రాష్ట్ర కార్యదర్శిపై దురుసుగా ప్రవర్తించిన మహిళా పోలీసులపై చర్యలు తీసుకోవాలి
# ఏబీవీపీ వరంగల్ జిల్లా కన్వీనర్ గజ్జల దేవేందర్
నర్సంపేట,నేటిధాత్రి :
జీవో నెం.55 ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ వరంగల్ జిల్లా కన్వీనర్ గజ్జల దేవేందర్ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ వ్యవసాయ ఉద్యాన యూనివర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించ వద్దు అంటూ అలాగే జీవో 55 ను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని శాంతి యుతంగా డిమాండ్ చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు చెయ్యి చేసుకోవడం,దురుసుగా ప్రవర్తించడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీపై మహిళా పోలీసులు బండిపై ఈడ్చుకొని వెళ్ళడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అని ఎద్దేవా చేశారు.ఏబీవీపీ నేత ఝాన్సీని జుట్టుపట్టుకొని ఈడ్చుకెళ్ళిన మహిళా పోలీసులపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దేవేందర్ డిమాండ్ చేశారు. జీవో నెం.55 వెనక్కి తీసుకొని వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములను కాపాడాలని కోరారు. ఈ సమావేశంలో కార్యకర్తలు సాయి విశాల్,ఉమర్ ఫారుక్,ప్రశాంత్,శ్రీకాంత్,రాహుల్,ప్రణయ తదితరులు పాల్గొన్నారు.