Farmers Demand Fair Price for Chilli
మార్కెట్లో అన్ని సరుకులకు జండాపాటను అమలు చేయాలి
మిర్చి క్వింటాకు 25వేల రూపాయల మద్దతు ధర ప్రకటించాలి
ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్
ఎనుమాముల మార్కెట్ ను సందర్శించిన ఏఐకేఎఫ్ ప్రతినిధి బృందం
నేటిధాత్రి ప్రతినిధి,వరంగల్/నర్సంపేట:
ఆసియా ఖండంలోని అతిపెద్ద వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మిర్చి రైతులను అధికారులు అర్తిదారులు కుమ్మక్కై నట్టేట ముంచుతున్నారని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆరోపించారు.మార్కెట్లో రైతులు సరుకులను అమ్మే సందర్భంలో నిర్ణయించే జెండా పాటను సరుకులన్నింటికీ అమలు చేసి దోపిడిని నివారించాలని కోరారు. మిర్చికి క్వింటాకు 25వేల రూపాయల కనీస మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. గురువారం అఖిల భారత రైతు సమాఖ్య రాష్ట్ర ప్రతినిధి బృందం వరంగల్ ఏనుమాముల మార్కెట్ ను సందర్శించి పంటల క్రయవిక్రయాలను, రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అడిషనల్ డైరెక్టర్ శ్రీ లక్ష్మణుడు, డిఎంఓ సురేఖ, మార్కెట్ కార్యదర్శి మల్లేశంలకు మెమోరాండం ఇచ్చారు.

ఈ సందర్భంగా ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి అప్పులతో పెట్టుబడి పెట్టి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పంటలు పండిస్తే మార్కెట్లో సరైన ధర రాక తీవ్రంగా నష్టపోయి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రైతులు తీసుకువచ్చిన మిర్చి పంటకు జెండా పాట పేరుతో కేవలం కొద్ది మంది రైతుల సరుకులకే అమలు చేసి మెజారిటీ రైతాంగానికి జెండా పాట కంటే అధిక వ్యత్యాసంతో కొనుగోలు చేస్తూ రైతులకు తీవ్రమైన నష్టాన్ని చేకూర్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి కొనుగోళ్లకు ఎలాంటి ప్రమాణాలు లేకపోవడంతో వ్యాపారులు ఖరీదుదారులు తమ ఇష్టానుసారంగా ధరలను నిర్ణయిస్తున్నారని అంతర్జాతీయ మార్కెట్లో మిర్చికి మంచి డిమాండ్ ఉన్నదని అదే సందర్భంలో గతంతో పోల్చితే పంట విస్తరణ దిగుబడి తగ్గిందని ఇలాంటి పరిస్థితుల్లో కుంటి సాకులతో రైతులు పండించిన మిర్చికి ధరను తగిన స్థాయిలో నిర్ణయించకపోవడం అన్యాయం అన్నారు.

అందుకని కనీసం జెండా పాటనైనా కొద్దిపాటి వ్యత్యాసంతో రైతులందరికీ సరుకులకు అమలుచేసి న్యాయం చేయాలని పేర్కొన్నారు. అలాగే మిర్చికి కనీస మద్దతు ధర కింటాకు 25 వేల రూపాయలు ప్రకటించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో రైతుల పంటలను తక్కువ ధరకు కొనుగోలు చేసి నష్టపరిచి మోసం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఐకేఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిఎన్ రెడ్డి హంస రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి కుసుంబా బాబురావు జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఇస్మాయిల్, ఏఐసిటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముక్కెర రామస్వామి, సుంచు జగదీశ్వర్, రైతు సంఘం నాయకులు మంద రవి, కర్ర రాజిరెడ్డి,ఐతం నాగేష్,మొగిలి శ్రీనివాసరావు, పరిమళ గోవర్ధన్ రాజు,సోమిడి రవి, పేరబోయిన ఐలోని, నరసయ్య, ప్రభాకర్ లతోపాటు రైతులు పాల్గొన్నారు.
