ఎస్ హెచ్ జీ సభ్యులకు బీమాతో ఆర్థిక భరోసా
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
37 మందికి రూ.38 లక్షల లోన్ బీమా చెక్కులు,
ఇద్దరికి ప్రమాద బీమా రూ. 20 లక్షలు పంపిణీ
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్.హెచ్.జీ) సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం బీమా కల్పిస్తూ ఆర్థికంగా భరోసా కల్పిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలకు బీమా, సభ్యులకు ప్రమాద బీమా చెక్కులను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అధికారులతో కలిసి సోమవారం పంపిణీ చేశారు. ముస్తాబాద్ మండలంలో 14 మందికి రూ. 14,96,457, తంగళ్ళపల్లి మండలంలో ఒకరికి రూ. 30 వేలు, గంభీరావుపేట మండలంలో 8 మందికి రూ.7,66,925, వీర్నపల్లి మండలంలో ఇద్దరికి రూ.2,67,434, ఎల్లారెడ్డిపేట మండలంలో 12 మందికి రూ.13,04,133 మొత్తం రూ. 38, 64,949 విలువైన చెక్కులు ఆయా స్వయం సహాయక సంఘాల బాద్యులకు అందజేశారు.
ఇద్దరికి ప్రమాద బీమా పంపిణీ అలాగే ముస్తాబాద్ మండలంలోని స్వయం సహాయక సంఘాలకు చెందిన ఇద్దరు సభ్యులు ప్రమాదవశాత్తూ మరణించగా, వారికి నామిని లకు రూ. 10 లక్షల చొప్పున మొత్తం రూ. 20 లక్షల విలువైన చెక్కులు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పంపిణీ చేశారు.కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, డీఆర్డీఓ శేషాద్రి, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.