ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి
లబ్ధిదారుల ఆందోళనపై మాజీ సర్పంచ్
ఫోరం అధ్యక్షుడు జగదీశ్వర్
జహీరాబాద్ నేటి దాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఝరాసంగం, కోహిర్, జహీరాబాద్, న్యాల్కల్, మొగుడంపల్లి మండలాల్లో ఇళ్లు లేని పేదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఫైనల్ బిల్లులు సకాలంలో విడుదల కావడం లేదని బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఝరాసంగం మండల్ మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు జగదీశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుండి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందుతున్నప్పటికీ, లబ్దిదారులు తమకు నచ్చిన విధంగా ఇళ్ల నిర్మాణం చేపడుతూ అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన బాకాయలను వెంటనే విడుదల చేస్తే వారికి కొంత ఊరటనిచ్చినట్టవుతుందని పేర్కొన్నారు. గతంలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు వేగంగా విడుదలయ్యేవని, ప్రస్తుతం నెలలు గడిచినా ఫైనల్ బిల్లులు అందకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. నిర్మాణ పనులు పూర్తి చేసినప్పటికీ బిల్లుల జాప్యం కారణంగా అప్పుల భారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు అదనంగా రూ.6 లక్షల సాయం అందిస్తామని ఇచ్చిన హామీని కూడా అమలు చేయాలని జగదీశ్వర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు.
