వివాహ వేడుకకు వచ్చి వెళ్తుండగా ఘోర ప్రమాదం:
జాతీయ రహదారిపై గుల్బర్గా వ్యక్తి దుర్మరణం
జహీరాబాద్ నేటి ధాత్రి :
జహీరాబాద్ మే 14: హైదరాబాద్లో బంధువుల వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన గురువారం మే 14, 2026 ఉదయం జహీరాబాద్ పరిధిలోని జాతీయ రహదారి 65 పై చోటుచేసుకుంది.కోహిర్ ఎస్సై టి. నరేష్ తెలిపిన వివరాల ప్రకారం… కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన సయ్యద్ సర్దార్, అతని భార్య సబీహా (30), పిల్లలతో కలిసి నాలుగు రోజుల క్రితం హైదరాబాద్లో ఉన్న తమ బంధువుల పెళ్లికి వచ్చారు. మే 13 సాయంత్రం వివాహ రిసెప్షన్ ముగించుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. భార్యాపిల్లలను ఇతర వాహనంలో పంపిన సర్దార్ కెఎ 32 ఎచ్ఎల్ 0274 నెంబర్ గల తన బైక్ పై ఒంటరిగా బయలుదేరాడు.మే 14 (గురువారం) ఉదయం 5:40 గంటల సమయంలో జహీరాబాద్ వైపు వస్తుండగా, దిగువాల్ గ్రామ శివారులోని పిరమిల్ కంపెనీ ఎదురుగా జాతీయ రహదారిపై సర్దార్ బైక్ను ఒక గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర రక్తగాయాలైన సర్దార్ రోడ్డుపైనే అక్కడికక్కడే మృతి చెందాడు.భర్త మృతిపై భార్య సబీహా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోహిర్ ఎస్సై కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమై, ఆగకుండా వెళ్ళిపోయిన గుర్తు తెలియని వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
