ఎన్నికల భరోసాగా రైతు భరోసా.
విజయోత్సవాల పేరుతో గత సీజన్ రైతు భరోసా,వడ్లకు బోనస్ ఎగనామం..
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే పెద్ది ఫైర్..
నర్సంపేట నేటిధాత్రి:
గత సీజన్ లో రైతు భరోసా, అలాగే వడ్లకు ప్రకటించిన బోనస్ లను ఎగనామం పెట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామా చేస్తున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర సివిల్ సప్లైస్ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో రైతు భరోసా పేరిట ఆడుతున్న డ్రామాలు ఆపి గత19 నెలల కాలంలో రైతులను అరిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని పెద్ది డిమాండ్ చేశారు.ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా ఎకరాకు రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పి 12 వేలకు పరిమితం చేయడం అలాగే గత వానకాలం,యాసంగిలో రైతు భరోసా ఎగ్గొట్టి ఓట్ల కోసం ఇప్పుడు విజయోత్సవాల పేరిట సంబరాలు జరపుకోవడం రైతులను మోసం చేయడం కాదా అని ప్రశ్నిస్తూ,రైతులకు ఏం చేశావని సంబరాలు చేస్తున్నారంటూ ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో ఒక్క చెక్ డ్యాం కట్టలేదని ఆరోపించారు.2022 మే 6 న వరంగల్ లో జరిపిన రైతు డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీ,సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ,ఆనాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది ప్రశ్నించారు.కాంగ్రెస్ దుర్మార్గ పాలనలో 511 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల బతుకులు సంక్షోభంలో కూరుకుపోయాయని అవేదన వ్యక్తం చేశారు.గత పదేండ్ల బిఆర్ఎస్ పాలన రైతు సంక్షేమ ప్రభుత్వమైతే నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రైతు సంక్షోభ ప్రభుత్వంగా పెరుపొందుతున్నదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎద్దేవా చేశారు.