కుట్ర పూరితంగానే నాపై అసత్య ఆరోపణలు
మిట్టపల్లి సర్పంచ్ కామెర మనోహర్ ఆగ్రహం
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలంలోని మిట్టపల్లి ఉప సర్పంచ్ కుమ్మరి రాజశేఖర్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని,అవన్నీ రాజకీయ కుట్రలో భాగమేనని గురువారం సర్పంచ్ కామెర మనోహర్ తీవ్రంగా ఖండించారు.తాను బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల కాలంలోనే గ్రామాభివృద్ధి కోసం సొంత నిధులతో హైమాక్స్ లైట్లు, తాగునీటి పైప్లైన్లు,ఆటస్థలం వంటి పనులు చేపట్టానని,ఇది చూసి ఓర్వలేకనే ఉప సర్పంచ్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.భూ అక్రమాలకు తాను సహకరించకపోవడం, కమిషన్ల కోసం ఆయన చేస్తున్న డిమాండ్లకు లొంగకపోవడమే ఈ వివాదానికి కారణమని స్పష్టం చేశారు.చివరకు మంత్రి మంజూరు చేసిన రూ. 40 లక్షల సీసీ రోడ్ల పనులను కూడా ఉప సర్పంచ్ తన స్వార్థం కోసం అడ్డుకుని రద్దు చేయించారని ఆరోపించారు.ప్రజా సేవయే తన లక్ష్యమని,ఇలాంటి బెదిరింపులకు భయపడకుండా గ్రామ ప్రగతి కోసం ముందుకు సాగుతానని సర్పంచ్ మనోహర్ తేల్చి చెప్పారు.
