ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలి.

రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ, బి.సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.

వనపర్తి / నేటి ధాత్రి.

ట్రాఫిక్ నిబంధనలు పాటించడమే కాకుండా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ ఒక సామాజిక బాధ్యతగా భావించి అరికట్టేందుకు కృషిచేయాలని రాష్ట్ర రవాణా, బి.సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. శనివారం మధ్యాహ్నం రోడ్డు భద్రత మాసోత్సవాలపై హైదారాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, ఎస్పీ, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సర రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించేదని, రోడ్డు భద్రతపై అత్యంత ప్రాధాన్యత దృష్ట్యా దీనిని రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నెల రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో రోడ్డు భద్రతా, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని స్కూల్, కళాశాలల్లో ట్రాఫిక్ ట్రాక్ ఏర్పాటు చేసి విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా పై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ అండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ మాట్లాడుతూ చాలా మందికి ట్రాఫిక్ రూల్స్ తెలియవని అడ్డదిడ్డంగా వాహనాలు నడపటం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రతిరోజూ ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. అందువల్ల ప్రమాదాల నివారణకు ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించటం, ర్యాలీలు ఏర్పాటు చేయటం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించేందుకు ప్రాంతాల వారీగా లింక్ ఏర్పాటు చేసి అక్కడి ప్రజలు, వ్యాపారస్తులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదం జరిగిన వెంటనే 108 కు సమాచారం ఇవ్వడం, దగ్గరలోని ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించడం పై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు భద్రత మాసొత్సవాలు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికలు చేయడం జరిగిందన్నారు. బ్లాక్ స్పాట్ గుర్తించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం, విద్యాలయాల్లో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనల పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నిబంధనలు పాటించని వాహన దారుల పై జరిమానాలు వేసేందుకు చర్యలు తీసుకోవాలని పోలీస్, రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. రోడ్డు భద్రతా కమిటీ సమావేశాలు తరచుగా నిర్వహించి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు.
వాహనాలపై పరిమితికి మించి ప్రయాణం చేయడం, రాంగ్ రోడ్ డ్రైవింగ్, హెల్మెట్ ధరించని, ర్యాష్ డ్రైవింగ్ చేసేవాళ్లను గుర్తించి జరిమానాలు విధించాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, డిఎస్పీ వేంకటేశ్వర రావు, ఆర్డీఓ సుబ్రమణ్యం, ఆర్.టి. ఒ మానస, పంచాయతీ రాజ్ ఈ ఈ మల్లయ్య, రోడ్లు భవనాలు డి. ఈ సీతారామ స్వామి ఎన్.ఐ.సి. ఐ.ఆర్.ఎ.డి. నుండి మురళీ కృష్ణ, డి.యం ఆర్టీసీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!