Election Expenditure Observers Inspect Poll Arrangements in Narsampet
ఎన్నికల వ్యయ పరిశీలకులు సందర్శన
నర్సంపేట, నేటిధాత్రి:
రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం ఎన్నికల వ్యయ పరిశీలకులు శివకుమార్ నాయుడు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంధ్యారాణి తో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించనున్న మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి చేపట్టిన పంపిణీ ఏర్పాట్లు, కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన సన్నాహాలు, స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు.పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేస్తున్న ఎన్నికల సామగ్రిని క్షుణ్నంగా తనిఖీ చేశారు. పోలింగ్ సామగ్రి సకాలంలో, సురక్షితంగా సంబంధిత పోలింగ్ కేంద్రాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించిన పరిశీలకులు, లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద చేపట్టిన భద్రతా చర్యలను పరిశీలించి, బ్యాలెట్ పేపర్లు మరియు బ్యాలెట్ బాక్సుల భద్రతకు సంబంధించి పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఎన్నికల వ్యయ నియంత్రణ, నియమ నిబంధనలు కచ్చితమైన అమలుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు
చేసుకోవాలని తెలిపారు. ఈ పరిశీలనలో ఆర్డీఓ ఉమారాణి,జిల్లా ఎస్సి అభివృద్ధి అధికారి భాగ్యలక్ష్మి,జిల్లా పరిశ్రమల అధికారి నరసింహమూర్తి,మున్సిపల్ కమిషనర్ భాస్కర్, తహసీల్దార్ రవిచంద్ర రెడ్డి, ఎన్నికల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
