కార్పోరేట్ విష వలయంలో విద్యా వైద్య రంగాలు.

కార్పోరేట్ విష వలయంలో విద్యా వైద్య రంగాలు…

విశ్వ జంపాల,న్యాయవాది మరియు
విశ్వ సమాజం వ్యవస్థాపకులు…

మహబూబాబాద్ గార్ల నేటి ధాత్రి:

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పలు రకాల విద్యా-వైద్య సంస్థలను నిర్వహిస్తూన్నాయి. వాటి నిర్వాహాణకు సరిపడా నిధులు మాత్రం కెటాయించడం లేదు. అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూన్నాయి.భారతదేశంలో పథకాలకు కొదువ లేదు, పైసలకు కొరత లేదు.

ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుస్తూన్నారు. ప్రధాన మంత్రులు, ముఖ్య మంత్రులు మారుతున్నారు, కాని ప్రజల జీవితాలు మాత్రం మారడం లేదు.

స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినప్పటికి సగటు భారతీయుని ప్రాథమిక హక్కులైన కూడు-గూడు-గుడ్డ తో పాటు విద్యా- వైద్యం-ఆరోగ్యం సమకూర్చడంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశ పూరిత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తూన్నాయి.

సమగ్ర విద్యా- వైద్య- ఆరోగ్య విధానాన్ని రూపొందించడంలోను, అమలు చేయడంలోను పూర్తిగా విఫలం చెందాయి. పూర్తి నిర్లక్ష్య దోరణి ప్రదర్శిస్తున్నాయి. ఓట్లు దండుకోవడంలో, సీట్లు దక్కించుకోవడంలో కనబరిచిన శ్రద్ధాశక్తులలో పది శాతం కల్గి వున్న “అక్షర భారత్ – ఆరోగ్య భారత్” నిర్మాణం జరిగి ఉండేది.

దీని పర్యావసానమే విద్యా -వైద్య రంగాలలో ప్రైవేటీకరణ- కార్పోరేటికరణ ప్రభలంగా పెరిగి పోయింది. విద్యా – వైద్య రంగంలో కార్పోరేట్ విష పోకడలు మొత్తం మానవాళి మనుగడకే ప్రమాదకరంగా పరిణమించాయి.

సమస్యల సాలెగూళ్ళలో చిక్కి ప్రభుత్వ విద్యా- వైద్య సంస్థలు ప్రజాదరణ కోల్పోతున్నాయి.

కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెపుతున్న ప్రభుత్వాలు విద్యా- వైద్య సంస్థల్లో నేటికి కనీస మౌళిక వసతులు కూడా కల్పించలేదు.

కమిటీలు, కమీషన్లు వేస్తూ, కడుపు నింపని సంక్షేమ పథకాలతో కాలయాపన చేస్తూ మీన వేశాలు లెక్కపెడుతున్నాయి. చిత్తశుద్ధి లోపించిన ప్రభుత్వాల పనితీరు ప్రజల పాలిటి శాపంగా మారింది.

లక్షలాది మంది విద్యార్థినీ విద్యార్థులు పోషక ఆహార లోపం, రక్తహీనత, కంటి, దంత, మూత్ర సంబంధిత వ్యాధులతో బాదపడుతున్నారు.సమాజ మనుగడకు విద్యా-వైద్యం-ఆరోగ్యం అతి ప్రధాన మైనవి. ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడం ప్రజాస్వామిక ప్రభుత్వాల ప్రధాన లక్షణం.

అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా గొప్పలు చెప్పుకుంటున్న భారత పాలక వర్గాలు ఆచరణలో దానికి భిన్నమైన వైఖరిని కల్గి వున్నాయి.

భారత దేశంలో భూస్వాములు- పెట్టుబడిదారులు ప్రైవేట్- కార్పోరెట్ శక్తులుగా ఎదిగి పాలక వర్గాలుగా అవతరించాయి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పాలక వర్గ ప్రయోజనాలే ప్రథమ కర్తవ్యంగా అంతర్గత ఎజెండాను అమలు చేస్తూన్నాయి.

ప్రభుత్వ అనుమతితోనే విద్యా-వైద్య రంగాల్లో కార్పోరేటీకరణ విష ఫలాలనందించే వట వృక్షంగా పెరిగిపోయింది.

కార్పోరేట్ యాజమాన్యాలు ప్రభుత్వ పాలక వర్గంలో కీలక భాగమై కూర్చున్నాయి.

విధానాల రూపకల్పనలో, అమలులో చక్రం తిప్పుతున్నాయి.

ఈ వర్గాలే సేవా రంగాలైన విద్యా-వైద్య రంగాలను అత్యంత లాభ సాటి వ్యాపారంగా మార్చాయి. ఈ వర్గాలే ప్రజలను కార్పొరేట్ రాజకీయాల వైపు మళ్లిస్తూ ఎన్నికల ప్రక్రియను, ప్రభుత్వాలను శాసిస్తున్నాయి.

కార్పోరేట్ యాజమాన్యాలు విద్యార్థులను, ఉపాధ్యాయులను, డాక్టర్లను కీలు బొమ్మల్లాగా మార్చుకున్నాయి.

ప్రైవేట్, కార్పోరేట్ విద్యా-వైద్య సంస్థల మధ్య నెలకొన్న తీవ్రమైన అనారోగ్యకరమైన పోటీ కారణంగా స్వార్ధం, అవినీతి అక్రమాలతో కూడిన తప్పుడు విధానాలకు పూనుకుంటున్నారు.పారి శుద్యం, త్రాగు నీరు, మల మూత్ర శాలలు, భోజన శాలలు, వంట శాలలు, పడకలు, పక్కా భవనాలు, ప్రహారి నిర్మాణాలు, మురుగు కాల్వలు, ఈగలు, దోమలు, శిధిలావస్థలో వున్న భవనాలు, విద్యుత్, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఫర్నీచర్, వైద్య పరికరాలు, మందులు తదితర మౌళిక వసతులు, సదుపాయాలు లేక ప్రభుత్వ విద్యా-వైద్య సంస్థలు ఆదరణ కోల్పోతున్నాయి.

వీటికి తోడు అరకొర నిధుల కెటాయింపు, సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపం, అవినీతి, నిర్లక్ష్యం తదితర ప్రధాన సమస్యలు ప్రభుత్వ విద్యా-వైద్య సంస్థలను నిత్యం పట్టి పీడిస్తున్నాయి.

సమస్యల వలయంలో చిక్కిన ప్రభుత్వ విద్యా-వైద్య సంస్థలు ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని కోల్పోయాయి.

ఒకప్పుడు విదేశీయులు, దోపిడి దొంగల భీభత్సంతో ప్రజలు అభద్రత భావంతో బ్రతికేవారు.

నేడు విద్యా-వైద్యం అందక జీవితంపై భయంతో, బెంగతో, అభద్రతా భావంతో జీవనం సాగిస్తున్నారు.

స్వాతంత్ర్యం వచ్చిన 78 ఏండ్లుగా పాలక వర్గాల మోసపూరిత, కుట్ర బుధ్ధితో విద్యా-వైద్య-ఆరోగ్య, ఉపాధి అవకాశాలు సామాన్య ప్రజలకు అందకుండా పోయాయి. వలసలు, అప్పులు, ఆకలి చావులు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి.

ఆకలి చావులైనా, ఆత్మ హత్యలైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలి.

నేడు దేశంలో జరుగుతున్న రైతు ఆత్మ హత్యలు, కుల వృత్తి దారుల ఆత్మ హత్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తూన్న ప్రజా వ్యతిరేక విధానాల మూలంగానే ఈ ఆత్మ హత్యలు జరుగుతున్నాయి.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్వార్థ పూరిత అనాలోచిత నిర్ణయాలు-నిర్లక్ష్యాల మూలాలే నేటి ఆత్మ హత్యలకు కారణాలు.ప్రజా ద్రోహులు, పెట్టుబడిదారులు, కార్పోరేట్ శక్తులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మమేకమవుతున్నాయి

ఇది చాలా ప్రమాదకరం. ప్రజలకు ఉపకరించే ప్రభుత్వ పథకాలను, లక్ష్యాలను నిర్వీర్యం చేస్తూ తమ వర్గ ప్రయోజనాలు కాపాడుకునే ప్రయత్నంలో భాగమే ఈ శక్తుల కలయిక.

భారత దేశ ప్రజలు విజయానికి, విజయం తాలూకు ఫలాలను ఆస్వాదించడానికి మధ్య ఉన్న సంధికాలంలో ఉన్నారు. ప్రజల నోటి కాడి ముద్దను దళారులు గుంజుకునేందుకు ప్రభుత్వ విధానాలే దోహదం చేస్తూన్నాయి.

ప్రజా ద్రోహులు-రాజకీయ దళారులు ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తూన్నారు.

విద్యా-వైద్యం-ఉపాధి మొదలైన మౌళిక రంగాలలో విధానాలు రూపొందించడం- అమలుపర్చడంలో ప్రజలు మరింత చైతన్యవంతమైన పోరాట స్పూర్తిని కలిగియుండాలి.

విద్య-వైద్య రంగాలలో కార్పోరేటీకరణ మానవజాతి మనుగడకే సమస్యగా తయారై ప్రజా జీవనానికి పెను సవాలుగా మారింది. ప్రజలందరికీ సమానమైన, నాణ్యమైన విద్య వైద్యం అందాలంటే విద్యా – వైద్యం జాతీయీకరణ చేయడమే ఏకైక పరిష్కారం.

విద్యా-వైద్యం జాతీయీకరణ జరిగేంత వరకు దోపిడి పీడన ఆగేంత వరకు అలుపెరగని పోరాటం చేయడమే ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version