సాగర్ ఎడమ కాలువ, ఏఎంఆర్పి కింద ఉన్న చెరువులను నింపాలి:
మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నల్లగొండ జిల్లా, నేటి దాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో ఎండిపోయిన పంటలను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కరువు బృందాలను నియమించి పరిశీలించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం నాడు తుమ్మల వీరారెడ్డి అధ్యక్షత నల్లగొండలో జరిగిన జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తక్షణం నాగార్జునసాగర్ ఎడిమ కాలువ, ఏ ఎమ్ ఆర్ పి కింద వేసిన పంటలను కాపాడడానికి కృష్ణాజలాలతో చెరువుల నింపడం ద్వారా పశుపక్షాలకు నీటి వసతి వస్తుందని చెప్పారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని నల్గొండ జిల్లాలో తాగునీటి కోసం గుర్తించిన చెరువులన్నింటిని నింపేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. వానాకాలం వేసిన పంటలలో యాసంగిలో 30 శాతం కూడా వరి పంట వేయలేదన్నారు. వేసిన వరి పంట కూడా ఎండిపోతుందని, ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో పండ్ల తోటలు ఎండిపోతున్నాయని రైతులు తీవ్ర ఆందోళనతో ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పంటలను కాపాడుకోవడం కోసం గ్రామాలలో పదుల సంఖ్యలో బోర్లు వేస్తున్న పడటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కరువు బృందాలను ఏర్పాటు చేసి పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నాగార్జునసాగర్ ఎడమ కాలువ, ఏ ఎమ్ ఆర్ పి కింద ఉన్న చెరువులను నింపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలతోపాటు తక్షణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా రైతులు రబీ లో రైతుబంధు కోసం వేచి చూస్తున్నారని, రెండు లక్షల రుణమాఫీ కోసం కూడా ఎప్పుడు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ధరణిలో పేర్కొన్న భూ సమస్యలను తక్షణమే పరిష్కరించుటకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్ కార్డును ఉంటేనే వర్తింప చేస్తారని ప్రభుత్వం ప్రకటిస్తుంది కానీ లేని వారికి ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలని అన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ రేషన్ కార్డు తో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
వేసవి దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం మంచినీటి సమస్య పంట నష్టం కరువు తదితర సమస్యలను దృష్టిలో ఉంచుకొని పరిష్కరించాలని కోరారు.
ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, డబ్బికారి మల్లేశం, బండా శ్రీశైలం, కందాల ప్రమీల, పాలడుగు నాగార్జున, ప్రభావతి, సిహెచ్ లక్ష్మీనారాయణ, సయ్యద్ హశం తదితరులు పాల్గొన్నారు.
