ఆషాడ మాసం కొత్త కోడలిని పుట్టింటికి ఎందుకు పంపిస్తారో తెలుసా…
ఆషాడ మాసంలో కొత్త కోడలిని పుట్టింటికి పంపించే సంప్రదాయం ఉంది. అయితే, అలా ఎందుకు పంపిస్తారో తెలుసా? ఈ నియమం వెనుక అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
హిందూ ధర్మం ప్రకారం, కొత్త కోడలు ఈ మాసంలో అత్త ముఖం చూడకూడదు. ఈ నిబంధన వెనుక ఉన్న భావం ఏమిటంటే, కొత్తగా పెళ్లైన వధువులకి అత్తింట్లో కొంత ఒత్తిడి, ఆందోళనగా ఉంటుంది. కాబట్టి, వారికి మానసిక విశ్రాంతి కల్పించేందుకు, స్వేచ్ఛగా కొన్ని రోజులు గడిపేందుకు, అత్తింటి నుంచి తాత్కాలికంగా విరామం ఇవ్వడం కోసం ఆషాడ మాసంలో కొత్త కోడలిని పుట్టింటికి పంపించే సంప్రదాయం ఏర్పడింది.
పూర్వం ఆషాడ మాసం అనేది వ్యవసాయ పనులకు చాలా కీలకమైన కాలం. అప్పట్లో పురుషులు పొలం పనుల్లో నిమగ్నమవుతూ ఇంటి విషయాలకు తక్కువ సమయం కేటాయించేవారు. అయితే, భార్య, భర్త కలసి ఉంటే ఆ వ్యక్తికి పనులపై దృష్టి తగ్గవచ్చని భావించి, తాత్కాలికంగా ఆషాడ మాసంలో భార్యను పుట్టింటికి పంపించే ఆచారం మొదలైంది.
ఆరోగ్య సమస్యలు
అలాగే, ఆషాడ మాసంలో గర్భం దాల్చినట్లయితే ప్రసవం వేసవికాలంలో జరుగుతుంది. వేసవిలో తల్లీ బిడ్డలకు ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని భావించి, ఈ మాసంలో దంపతులను వేరు వేరు ఉంచే సంప్రదాయాన్ని కొనసాగించారని చెబుతారు. ఆధునిక సమాజంలో ఈ నిబంధనలు, ఆచారాలు తక్కువగా పాటిస్తున్నారు. అయితే, దీని వెనుక ఉన్న కారణాలు తెలుసుకోవడం వల్ల మన పూర్వికుల దూరదృష్టిని అర్థం చేసుకోవచ్చు