దళితులపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయి!
డిబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్..
కులవివక్షత చట్టరీత్యా నేరం
దళితులు సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తాం
తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి సిఐ సంతోష్ కుమార్
వరంగల్/హనుమకొండ/ఆత్మకూర్,నేటిధాత్రి:
సమాజంలో దళితులపై దాడులు,దౌర్జన్యాలు,కుల వివక్షత రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఎస్సీ,ఎస్టీ కేసులలో నిందితులకు స్టేషన్ బెయిలు ఇవ్వకుండా కఠినంగా శిక్షించాలని దళిత బహుజన ఫ్రంట్ (డిబీఎఫ్) జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ డిమాండ్ చేశారు.సోమవారం ఆత్మకూరు మండలంలోని నాగయ్య పల్లిలో పంచాయితీ కార్యదర్శి సునీల్ కుమార్ అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవం నిర్వహించి ప్రజలకు హక్కులపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మాదాసి సురేష్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ దళితులు అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నాగయ్య పల్లి ఎస్సీల స్మశాన వాటికను రికార్డులో నమోదు చేసి అభివృద్ధి పరచాలని, దళితులందరికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, గ్రామంలో రెండు గ్లాసుల పద్ధతి కొనసాగుతుందని దీనిని నిర్మూలించడానికి అవగాహన కార్యక్రమాలు, కలజాత ప్రోగ్రాములు నిర్వహించాలని కోరుతూ మాదాసి సురేష్ ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు.తహాసిల్దార్ జగన్మోహన్ రెడ్డి,సిఐ సంతోష్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని,దళితుల పట్ల వివక్షత చూపితే చట్టరీత్యా నేరం అవుతుందని కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.దళితులు సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు జనక అశోక్,గిన్నారపు భాస్కర్,మాదాసి శ్రీనివాస్, మాదాసి రాజు, నేరెళ్ల రమణారెడ్డి,నేరెళ్ల రాజు, పోగుల ప్రశాంత్, కారోబార్ మాదాసి రాజు,ఫీల్డ్ అసిస్టెంట్ మాదాసి ప్రసాద్,అంగన్ వాడి టీచర్ పోగుల అనోధ,ఆయా గుండాల జయలక్ష్మి మధ్యాహ్న భోజన కార్మికురాలు జినుక సంధ్య తదితరులు పాల్గోన్నారు.