ఏజెన్సీ ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పోలీసు అధికారులు నిత్యం వారికి అందుబాటులో ఉండాలి
ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
మంగళవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఇల్లందు సబ్ డివిజన్లోని ఏజెన్సీ పోలీస్ స్టేషన్లయిన గుండాల,ఆళ్లపల్లి,కొమరారం మరియు బోడు పోలీస్ స్టేషన్లను సందర్శించారు.ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న పోలీసు అధికారులను ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి అట్టి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అధికారులకు సూచించారు.సైబర్ క్రైమ్స్ పట్ల అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు.అదేవిధంగా నిషేధిత మావోయిస్టుల కదిలికలపై కూడా ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.రాబోయే పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.అనంతరం ఆయా పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న అధికారులు మరియు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరిస్తామని తెలియజేశారు.