Subsidy Farm Machines Distributed to Farmers in Nekkonda
నెక్కొండ రైతు వేదికలో రైతులకు యంత్ర పరికరాల పంపిణీ
#నెక్కొండ, నేటి ధాత్రి:
నర్సంపేట నియోజకవర్గ స్థాయిలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమం నెక్కొండ మండలంలోని రైతు వేదికలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నెక్కొండ గ్రామ సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్ , కలిసి రైతులకు రోటవేటర్లు, స్ప్రేయర్లు, వరిగడ్డి కట్టే యంత్రాలు, 11 చాళ్ల నాగళ్ళు తదితరంగా మొత్తం 86 వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యంత్ర పరికరాల సబ్సిడీ పథకాన్ని పునరుద్ధరించిందన్నారు. ఈరోజు రూ.16.5 లక్షల విలువైన యంత్ర పరికరాలను 86 మంది రైతులకు అందించామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను నర్సంపేట నియోజకవర్గ రైతులకు రూ.95 లక్షల విలువైన సబ్సిడీ యంత్ర పరికరాలను ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి మార్గదర్శకత్వంలో రైతులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నామని చెప్పారు.
అనంతరం “ఆత్మ” పథకం కింద రైతులకు వ్యవసాయంలో నైపుణ్యత పెంపు, సాంకేతిక పద్ధతులపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్ జిల్లా “ఆత్మ” ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయనిర్మల మాట్లాడుతూ రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి, విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా అధిక లాభాలు పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు దామోదర్ రెడ్డి, నెక్కొండ మండల వ్యవసాయ అధికారురి నాగరాజు తో పాటు నర్సంపేట మండల వ్యవసాయ అధికారి, ఏ ఈ ఓ లు అరుణ్, వసంత, ఆత్మ కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.
