సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమం.

Ration shops

రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమం

– అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యంగా పథకాల అమలు

– మంత్రి పొన్నం ప్రభాకర్

– సిరిసిల్లలో సన్నబియ్యం పంపిణీని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ప్రారంభించిన మంత్రి

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

 

రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమమని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త  బస్ స్టాండ్ వద్ద ఉన్న రేషన్ దుకాణంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితే తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని మంత్రి, విప్, కలెక్టర్, ఎస్పీ తదితరులతో కలిసి పంపిణీ చేశారు.

అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు దేశంలో ఎక్కడా లేనివిధంగా మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రారంభించారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు రాష్ట్రంలోని 17,263 రేషన్ దుకాణాల్లో రెండు లక్షల 91 కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నామని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడు సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యంగా వివిధ పథకాలు అమలు చేస్తుందని వివరించారు. దాదాపు 60 వేల ఉద్యోగాలను తమ ప్రభుత్వం భర్తీ చేసిందని గుర్తు చేశారు. మహిళల అందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు,రూ. 500 కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు. మహిళా మణులను కోటీశ్వరులుగా చేయాలని సదుద్దేశంతో ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి కింద వివిధ యూనిట్లు ప్రారంభించామని తెలిపారు. అలాగే సోలార్ యూనిట్లు మహిళా సంఘాలకు బస్సులు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. సన్న సన్న ధాన్యం పండించే రైతులకు క్వింటాల్కు అదనంగా 500 అందజేస్తూ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీకి నూతన బస్సులు అందజేస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పాటును అందజేస్తున్నామని వివరించారు.

జిల్లాలోని 345 రేషన్ దుకాణాలు ద్వారా..

రాష్ట్ర ప్రభుత్వం సోషియో ఎకనామిక్ సర్వే ను ఇటీవల నిర్వహించిందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ఆమోదించిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని నేత కార్మికులకు భరోసా కల్పిస్తూ గత బకాయిలను విడుదల చేసిందని, అలాగే యార్న్ బ్యాంకును ప్రారంభించిందని వారి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. దాదాపు 20వేల కోట్ల రూపాయల రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని వెల్లడించారు. త్వరలో పెన్షన్ పంపిణీ ఇతర కార్యక్రమాలను ప్రారంభించనున్నామని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని ప్రకటించారు. జిల్లాలోని 345 రేషన్ దుకాణాలు ద్వారా లక్ష 70 వేల రేషన్ కార్డుల లబ్ధిదారులకు
3275 మెట్రిక్ టన్నులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా లబ్ధిదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, జిల్లా పౌర సరఫరాల అధికారి వసంత లక్ష్మి, పౌర సరఫరాల మేనేజర్ రజిత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!