Collector Reviews Arrangements for Kommala Jatara
కొమ్మాల జాతర ప్రాశస్త్యాన్ని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు
కొమ్మాల జాతర బ్రహ్మోత్సవాలపై కలెక్టర్ సమీక్ష
మార్చి 3 నుంచి 8 వరకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..
నర్సంపేట,నేటిధాత్రి:
కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జాతర ప్రాశస్త్యాన్ని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా పౌర సంబంధాల శాఖతో సమన్వయం చేసుకుని ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆలయ కార్యనిర్వాహక అధికారిని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు.వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలో నిర్వహిస్తూన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద కలెక్టరేట్ లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 3 నుంచి మార్చి 8 వరకు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.పోలీస్, ఆరోగ్య, రెవెన్యూ, ఆర్టీసీ, విద్యుత్, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, జిల్లా పంచాయతీ, పౌర సంబంధాల, అగ్నిమాపక తదితర శాఖలు సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధంచేసి పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.జాతర సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో విద్యుత్ అలంకరణలు, చలువ పందిళ్లు, క్యూ లైన్లు, త్రాగునీటి సదుపాయం, అన్నదాన కార్యక్రమాలు, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, వైద్య శిబిరాలు, శానిటేషన్ చర్యలు సమర్థంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
జాతర ప్రాశస్త్యాన్ని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా పౌర సంబంధాల శాఖతో సమన్వయం చేసుకుని ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆలయ కార్యనిర్వాహక అధికారిని సూచించారు.సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామ్ రెడ్డి, ఆర్డీవో సుమ, గీసుకొండ తహసీల్దార్ రియాజుద్దీన్,సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
