వినియోగదారులు ఆన్ లైన్ లో మాత్రమే సిలిండర్ బుక్ చేసుకోవాలి
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు
మంచిర్యాల,నేటి ధాత్రి:
గ్యాస్ వినియోగదారులు ఆన్ లైన్ లో మాత్రమే సిలిండర్లను బుక్ చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు తెలిపారు.గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా అదనపు కలెక్టర్ ఛాంబర్ లో ఎల్ పి జి డీలర్లతో అత్యవసర సమావేశం నిర్వహించి గ్యాస్ కంపెనీల సేల్స్ అధికారులతో ఫోన్ ద్వారా సమావేశమయ్యారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో గృహ అవసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలు,గోదాముల వద్దకు వెళ్లకుండా ఆన్ లైన్ లో మాత్రమే సిలిండర్లను బుక్ చేసుకోవాలని తెలిపారు.గ్యాస్ బుకింగ్ సమయం సింగిల్ సిలిండర్ వారికి 25 రోజులు,డబుల్ సిలిండర్ వారికి 30 రోజుల వ్యవధి ఉంటుందని తెలిపారు.గ్యాస్ డెలివరీ చేసే సమయంలో వినియోగదారులు డెలివరీ బాయ్ కు ఓ టి పి చెప్పి సహకరించాలని, హోటల్,రెస్టారెంట్లలో వాణిజ్య సిలిండర్ మాత్రమే ఉపయోగించాలని,నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ సిలిండర్లు ఉపయోగించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.గ్యాస్ సిలిండర్ల విషయంలో ఎవరైనా కృత్రిమ కొరతను సృష్టించి,బ్లాక్ మార్కెట్ లో సిలిండర్లను విక్రయించాలని చూస్తే నిత్యవసరల సరుకుల చట్టం 1955 క్రింద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఎల్ పి జి వినియోగదారులు కె వై సి తప్పనిసరిగా చేసుకోవాలని, గ్యాస్ ఏజెన్సీ ల వద్ద,ఆన్ లైన్, గ్యాస్ కంపెనీ అధికారిక వెబ్సైట్, యాప్ లో,గ్యాస్ సిలిండర్ పంపిణీ సమయంలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల వద్ద పూర్తి చేసుకోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
