రో హౌస్‌లు కూల్చకపోతే కార్మికుల నోట్లో మట్టే!

 

`మాకు భూములు ఎందుకన్న దాసరి నారాయణరావు మాటలు మర్చిపోయారు.

`కోట్లు సంపాదించుకున్న వాళ్లకు స్థలాలెందుకు అన్న మాటలు విస్మరించారు.

`కార్మికుల కోసం కేటాయించిన భూమిని లాక్కున్నారు.

`రో హౌస్‌ల పేరుతో విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారు.

`రోహౌస్‌ల నిర్మాణమే అక్రమం.

`1500 ఎస్‌ఎఫ్టీలలో నిర్మాణాల కోసం అనుమతులు తెచ్చుకున్నారు.

`అనుమతులను అతిక్రమించి 2500 ఎస్‌ఎఫ్టీలలో రోహౌస్‌లు కట్డుకున్నారు.

`అటు చట్టాలను ఉల్లంఘించారు.

`ఇటు కార్మికులకు తీరని అన్యాయం చేశారు.

`సినిమాలు తీసి కోట్లు సంపాదించుకున్నారు.

`లాభాలొచ్చిన సినిమాలలో కార్మికులకేమైనా వాటాలు ఇచ్చారా!

`కార్మికులను కోటీశ్వరులను చేశారా!

`పేరుకే సినీ కార్మికులు..నిత్యం పస్తులతోనే బతుకులు.

`అలాంటి వారి భూమిలో సినీ గద్దలు పాతుకుపోయారు.

`అటు చట్టాన్ని మోసం చేశారు.

`ఇటు కార్మికుల ఉసురుపోసుకున్నారు.

`రో హౌస్‌ల విషయంలో పూటకో నాటకమాడుతున్నారు.

`అధికారులను గుప్పిట్లో పెట్టుకొని కార్మికులకు జీవనాధారం లేకుండా చేశారు.

`చిత్రపురి ప్రైవేటు స్థలం కాదు.

`సినీ పెద్దలు కష్టపడి కొనుక్కున్నది అసలే కాదు.

`రో హౌస్‌ లు నిర్మాణం చేసుకున్న స్థలం వారిది కానే కాదు.

`1500 ఎస్‌ఎఫ్టీ పర్మిషన్లో 2500 ఎస్‌ఎఫ్టీ నిర్మాణమేమిటి?

`రో హౌస్‌ లు నిర్మాణం చేసుకున్న వారికి అధికారుల సహకారమేమిటి?

`కోర్టు ఆదేశాలను కూడా దిక్కరిస్తున్నారు!

`అధికారులు కూడా కోర్టు ఆదేశాలను పెడచెవిన పెడుతున్నారు.

`లా లోవున్న లొసుగులతో రో హౌస్‌ ల యజమానులను కాపాడుతున్నారు.

`కోట్లు మింగుతూ కార్మికుల జీవితాలను ఆగం చేస్తున్నారు.

`ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ రో హౌస్‌ లను కూల్చేస్తామని మాటిచ్చారు.

`మ్యానిఫెస్టోలో 34 అంశంగా చేర్చారు.

`అధికారులు ప్రభుత్వాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారు.

`ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిపెడుతున్నారు.

`రో హౌస్‌ ల యజమానులకు కొమ్ము కాస్తున్నారు.

`ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకపోతే కార్మికులకు న్యాయం జరగదు.

`రో హౌస్‌ లు కూల్చకపోతే కార్మికులకు నిలువ నీడ వుండదు.

`సినీ పెద్దలు తప్పు మీద తప్పు చేస్తున్నారు.

-ఎన్నటికైనా రో హౌస్‌ లు వీడక తప్పదు.

`14 ఎకరాలు కార్మికులకు అప్పగించడం ఆగదు.

`సినీ పెద్దలు ఎన్ని విన్యాసాలు వేసినా కుదరదు.

`ప్రభుత్వం దృష్టి పెడితే మీ పప్పులేమీ ఉడకవు.

`అధికారులను నమ్ముకుంటే నిండా మునగక తప్పదు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

చిత్రపురిలో పద్నాలుగు ఎకరాలు ఆక్రమించుకొని సినీ పెద్దలు అక్రమంగా నిర్మాణం చేసుకున్న రో హౌజ్‌లను కూలగొట్టకపోతే ఇక కార్మికుల జీవితాలకు సొంతింటి కల భవిష్యత్తులో నెరవేరే అవకాశమే లేదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తు చేసుకోవాలి. చిత్రపురిలో సినీ పెద్దలు స్థలం కోసం ఆరాటపడుతున్న రోజులవి. ఎలాగైనా చిత్రపురిలో తాము కూడా దూరాలనుకున్న సందర్భంలో దివంగత దర్శకరత్న దాసరి నారాయణ రావు వద్దకు సినీ కార్మికులు వెళ్లారు. ప్రభుత్వం సినిమా కార్మికుల కోసం కేటాయించిన భూమిలో పెద్దలంతా కూడా కావాలంటున్నారు. వాళ్లు ప్రత్యేకమైన ఇల్లు నిర్మాణం చేసుకోవాలనుకుంటున్నారన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం కేటాయించిన భూమికి నిర్ణయించిన మేరకు తామే డబ్బులు చెల్లించడం జరిగింది. కాని ఇప్పుడు సినిమా పెద్దలు కొంత మంది దూరే ప్రయత్నం చేస్తున్నారు. మాకు అన్యాయం చేయాలని కుట్ర చేస్తున్నారని దాసరికి చెప్పారు. దాంతో ఆయన ఏకంగా ఈ విషయంపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చిత్రపురిలో ఎట్టిపరిస్ధితుల్లో సినీ పెద్దలు దూరొద్దని సూచించారు. చిత్రపురి అన్నది కేవలం కార్మికుల కోసమే అని కూడా ఆయన ఆనాడు స్పష్టం చేశారు. సినీ పెద్దలు ఎవరూ చిత్రపురిలో స్ధలాల కోసం ఆలోచన చేయొద్దని సూచించారు. సినీ పెద్దలు ఎవరూ అడుక్కునే స్ధాయిలో లేరు. సినిమాలు తీసి ప్రేక్షకుల ఆశీస్సులతో కోట్లు సంపాదించుకున్నారు. అసలు సినిమాలకే రాయితీలు వద్దని కోరుతున్న తరుణంలో చిత్రపురిలో స్ధలం కోరుకోవడం సరైంది కాదని తేల్చి చెప్పారు. సినిమాలు నిర్మాణం చేసే నిర్మాతలు, దర్శకులు, హీరోలు, ఇతర సహాయక నటులు అందరూ స్ధితిమంతులయ్యారు. ఒకరికి పెట్టే స్ధాయిలోనే వున్నారు. అలాంటి వాళ్లు చిత్రపురిలో ఇల్లు కోరుకోవడం ఎంత మాత్రం ఆహ్వానించాల్సింది కాదని అన్నారు. సినిమాల వల్ల కోట్లు లాభం వచ్చినప్పుడు కార్మికులకు లాభాల్లో వాటాలు పంచిన చరిత్ర వుందా? అలాంటప్పుడు కార్మికులు కొంత వాటాతో ప్రభుత్వం నుంచి స్థలం తీసుకున్నప్పుడు అందులో సినీ పెద్దలు కొంత భూమి కోరుకోవడం ఎట్టిపరిస్దితుల్లోనూ మంచిది కాదని ఆనాడే చెప్పారు. ఈ విషయం కుండబద్దలు కొట్టి చెప్పిన దాసరి నారాయణ రావు బతికున్నంత కాలం చిత్రపురిలో సినీ పెద్దలు ఎవరూ వేలు పెట్టలేదు. ఆయన చనిపోయిన తర్వాత సినీ పెద్దలు చిత్రపురి మీద కన్నేశారు. కార్మికులకు నగరం నడిబొడ్డున అంత ఖరీదైన స్దలాలు అందడాన్ని వాళ్ల జీర్ణించుకోలేకపోయారు. నిజానికి సినీ పెద్దలంతా అందరూ కాదు. అందరూ దూరితే కార్మికులకు కనీసం గజం స్ధలం కూడా వచ్చేది కాదు. కొంత మంది స్వార్ధపరులు చిత్రపురిపై కన్నేశారు. అందులో బడా నిర్మాతలతోపాటు, కొంత మంది బలిసిన క్యారెక్టర్‌ ఆర్టిస్టులు, దర్శకులు కూడా వున్నారు. వారి మూలంగా కార్మికులకు తీరని అన్యాయం జరుగుతోంది. దీనిపై రెండు దశాబ్దాలుగా పోరాటం సాగుతున్నా కార్మికులకు న్యాయం జరగడం లేదు. మరింత అన్యాయమే జరుగుతోంది. చిత్రపురిలో రో హౌజ్‌ల నిర్మాణమే చేయొద్దు. నమూనా తయారు చేసినప్పుడు అలాంటి ప్రతిపాదనలు లేవు. అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసినప్పుడు ఎట్టిపరిస్దితుల్లోనూ ఎవరి ఇల్లు వారికి సొంతగా నిర్మాణం చేసుకునే వీలు లేదు. కేవలం అప్పార్టుమెంటు ప్లాట్లను మాత్రమే నిర్మాణం చేయాలి. ఎన్ని వీలైతే అన్ని అప్పార్టుమెంట్లు నిర్మాణం చేసి కార్మికులందరికీ ఫ్లాట్లు వచ్చేలా చూడాలి. సభ్యత్వం కల్గిన ప్రతి కార్మికుడిని సొంతంటి కల నెరవేరాలన్నది స్పష్టం చేశారు. ఎందుకంటే హైదరాబాద్‌లో వున్న స్టూడియోలు జూబ్లిహిల్స్‌లోనే వున్నాయి. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాలు షూటింగ్‌లకు అనువైన ప్రాంతం. ఇప్పటిలాగా ఆ రెండు ప్రాంతాలు జనారణ్యాలు కాదు. కాంక్రిట్‌ జంగల్‌ లేదు. ప్రకృతి సంపదతో అలరాలుతుండేది. నగరంలో అద్దెలకు వుండే కార్మికులకు అందే సొమ్ముతో అద్దెలు చెల్లించుకోడం కష్టంగా వుండేది. పైగా ఒకప్పటి నగరం నుంచి స్టూడియోలకు వెళ్లడానికి చాలా సమయం పట్టేది. ఈ రెండు కారణాల వల్ల కార్మికులు స్టూడియో ప్రాంతాలకు అందుబాటులో వుంటే వారికి ఎంతో ఉపయోగ కరంగా వుంటుందని నటుడు ,నిర్మాత దివంగత ప్రభాకర్‌రెడ్డి అప్పటి ప్రభుత్వంతో మాట్లాడి తన సొంత స్ధలం పక్కన 64 ఎకరాలు ఇచ్చేలా ఒప్పించారు. తన 4 ఎకారాలు కూడా చిత్రపురికి రాసిచ్చారు. అలాంటి స్ధలంలో కార్మికుల భూమిని సినీ పెద్దలు లాక్కున్నారు. సుమారు 14 ఎకరాలు సొంతం చేసుకున్నారు. ఆ స్థలంలో 225 రోహౌజ్‌లు నిర్మాణం చేసుకున్నారు. అసలు రోహౌజ్‌ల నిర్మాణమే చట్టబద్దంతా తప్పు. అదికారుల ఉదాసీత, అవినీతి కారణంగా సినీ పెద్దల రోహౌజ్‌ల 1500 ఎస్‌ఎఫ్‌టిలో నిర్మాణానికి అక్రమంగా అనుమతులు ఇచ్చారు. దాన్ని అలుసుగా తీసుకొని సినీ పెద్దలు 1500 ఎస్‌ఎఫ్‌టిలో నిర్మాణానికి అనుమతులు తెచ్చుకొని తిరిగి ఇక్కడ కూడా ప్రభుత్వాన్ని మోసం చేశారు. కార్మికులకు మరింత అన్యాయం చేశారు. 1500 ఎస్‌ఎఫ్‌టిలో మాత్రమే రోహౌజ్‌లను నిర్మాణం చేసుకోవాల్సిందిపోయి కొంత మంది 2500 ఎస్‌ఎఫ్‌టీ కూడా ఆక్రమించుకున్నారు. రోహౌజ్‌లు నిర్మాణం చేసుకున్నారు. అసలు రోహౌజ్‌ నిర్మాణమే అక్రమని అని కార్మికులు నెత్తినోరు మొత్తుకొని చెబుతున్నా అధికారులు పట్టించుకోలేదు. ముందైతే నిర్మాణాలు చేసుకోండి. తర్వాత పర్మిషన్లకు దరఖాస్తు చేసుకోండని కొంత మంది అవినీతి అధికారులు ఇచ్చిన సూచనలతో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు రోహౌజ్‌లు నిర్మాణం చేసుకున్నారు. ఆ విషయం కోర్టుకు వెళ్లింది. చాలా కాలం ఈ విషయం కోర్టులో పెండిరగ్‌లో వుంది. ఈ మధ్యే దానిపై తీర్పు కూడా వచ్చింది. అసలు రోహౌజ్‌ల నిర్మాణాలే అక్రమని తెలిసినా, మరింత స్థలం ఆక్రమించుకొని నిర్మాణాలు చేయడం చట్ట వ్యతిరేకమని కోర్టు తీర్పునిచ్చింది. వాటికి తొలగించాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. వెంటనే రోహౌజ్‌ల యజమానులకు నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. కాని అధికారులు కోర్టు ఆదేశాలను కూడా పక్కన పెట్టారు. అధికారులు రో హౌజ్‌ల యజమానులకు తొత్తులుగా మారి కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఎక్కడా అక్రమ నిర్మాణాలు జరక్కుండా చూసుకోవాల్సిన అధికారులే దగ్గరుండి వాటి నిర్మాణాలకు అనుమతులిచ్చారు. అటు అధికారులు, ఇటు సినీ పెద్దలు చట్టాలను ఉల్లంఘించారు. కార్మికుల జీవితాలతో ఆటలాడుకున్నారు. కార్మికుల స్థలంలో తమకు కూడా చోటు కావాలనుకున్న సినీ పెద్దలు సినిమాల లాభాలలో ఏనాడైనా రూపాయి సాయం చేశారా? కార్మికులను కోటీశ్వరులను చేశారా? పేరుకే సినీ కార్మికులు కాని వారి జీవితాలు నిత్య నరకమే. ఆకలి పస్తులే. షూటింగ్‌లలో కూడా చాలీ చాలని భోజనాలే..ఇదే వారి దుర్భరమైన జీవితం. కేవలం కళను నమ్ముకొని, సినిమాల మీద మోజుతో, రంగుల ప్రపంచంలో వెలుగొందాలని హైదరాబాద్‌ చేరిన ఎంతో మంది కార్మికుల తమ జీవితాలు ఎక్కడికి వెళ్తున్నాయో కూడా తెలియని అయోమయంలో బతుకుతున్నారు. రోజు వారీ కూలీలకన్నా దుర్భరంగా బతుకుతున్నారు. ఒకనాడు షూటింగ్‌ వుంటే, వారం రోజులు పని లేకుండా జీవితాలు గడుతుంటారు. నెలలో సగం రోజులు పస్తులుంటారు. నెల నెల అద్దెలు చెల్లించలేక అవస్ధలు పడుతుంటారు. అలాంటి వారికి నీడ కోసం కేటాయించిన స్ధలంలో సినీ పెద్దలు దూరి వారి జీవితాలను ఆగం చేశారు. కార్మికుల ఉసురు పోసుకున్నారు. అధికారులను గుప్పిట్లో పెట్టుకొని కార్మికులకు జీవనాదారం లేకుండా చేశారు. నిజానికి చిత్రపురిలో సినీ పెద్దలకు ఎలాంటి సంబంధం లేదు. రూపాయి రూపాయి పోగేసుకొని కార్మికులు కొనుక్కున్న స్ధలం. రోహౌజ్‌ల నిర్మాణం కోసం కార్మికుల స్ధలాన్ని ఆక్రమించుకోవడం తప్ప కొనుగోలు చేసింది లేదు. ఓ వైపు కోట్లు మింగుతూ కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పింది. రోహౌజ్‌లను కూల్చివేస్తామని మాట ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రభుత్వానికి సరైన నివేదికలు ఇవ్వకుండా, న్యాయవ్యవస్ధను కూడా మోసం చేస్తున్నారు. ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటే తప్ప కార్మికులకు న్యాయం జరిగేలా లేదు. సినీ పెద్దలు తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఎప్పటికైనా రోహౌజ్‌లను విడిచిపెట్టకతప్పదు. ప్రభుత్వం వాటిని కూల్చివేయక తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *